హైదరాబాద్, ఆంధ్రప్రభ: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సి) పరీక్షలు రాసే ఉద్యోగార్థులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఇక నుంచి తెలుగు భాషల్లోనూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు నిర్వహించునున్నారు. హిందీ, ఇంగ్లీషుతోపాటు మరో 13 భాషల్లోనూ ఎస్ఎస్సీ పరీక్షలు నిర్వహించునున్నారు. పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని గతంలో కేంద్రాన్ని సీఎం కేసీఆర్ కోరిన నేపథ్యంలో ఈమేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2020 నవంబర్ 18న ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు.
రైల్వేలు, డిఫెన్సు, బ్యాంకు తదితర కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా చేపట్టే ఉద్యోగ నియామక పోటీ పరీక్షలను కేవలం హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాత్రమే నిర్వహించేవారు. అయితే ఇలా నిర్వహించడం సరికాదని, భిన్న భాషలున్న దేశంలో ఆయా రాష్ట్రాల స్థానిక భాషల్లోనే పరీక్షలు నిర్వహించి నిరుద్యోగులు నష్టపోకుండా చూడాలని సీఎం కేసీఆర్ గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
అయితే కేసీఆర్ డిమాండుకు కేంద్రం స్పందించి హిందీ, ఇంగ్లీష్తో పాటు రాజ్యాంగం 8వ షెడ్యూల్లో పొందుపరిచిన అన్ని భారతీయ భాషల్లో పోటీ పరీక్షలు నిర్వహించాలని కేంద్ర స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈమేరకు నిర్ణయం తీసుకున్నది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వారి వారి రాష్ట్రాల్లో జరిగే గ్రూప్ 1, 2, 3, ఎస్సై, కానిస్టేబుల్ తదితర పోటీ పరీక్షల కోసం అయ్యే ప్రిపరేషన్ కూడా ఎంతగానో ఉపయోగ పడుతుంది.