Tuesday, April 16, 2024

భూగర్భ జలాల పరిరక్షణ మనందరి బాధ్యత : మంత్రి నిరంజన్‌ రెడ్డి..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : భూగర్భ జలాల పరిరక్షణ మనందరి బాధ్యత అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. రోజు రోజుకూ అడుగంటుతున్న భూగర్భ జలాలను కాపాడుకోవల్సిన అవసరం ఉందన్నారు. ఇండ్ల పరిసరాల్లోఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకుని రాబోయే వర్షాకాలంలో ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టి భూగర్భ జలాల పెంపుకు కృషి చేయాలని ప్రజలను ఆయన కోరారు. ప్రపంచ నీటి దినోత్సవం పురస్కరించుకుని జలమండలి, గాంధీ జ్ఞాన్‌ ప్రతిష్టాన్‌ సంయుక్త ఆధ్వర్యంలో భూగర్భ జలాల పరిరక్షణ అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం మంత్రుల నివాస ప్రాంగణంలో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ప్రజల తాగు నీరు, సాగునీరు కోసం పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి, కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని చెప్పారు.

మూడేళ్ళలో ప్రపంచంలో ఎతైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారన్నారు. అలాగే పాలమూరు రంగారెడ్డి 70 శాతం పూర్తి అయ్యిందన్నారు. ఏడేళ్ళలో తెలంగాణలోని కోటి ఎకరాలకు సాగు నీటిని అందిస్తూ దేశంలోనే వ్యవసాయ రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత సిఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కోట్లాది రూపాయల వ్యయంతో ఎన్నో వందల కిలోమీటర్ల నుంచి నీటిని తీసుకొచ్చి హైదరాబాద్‌ నగర ప్రజల దాహర్తిని తీర్చుతున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జలమండలి డిజిఎం శ్రీనివాస రావు, జి.ఎం. రాంబాబు, గాంధీ జ్ఞాన్‌ ప్రతిష్టాన్‌ సంస్థ ప్రతినిధులు డాక్టర్‌ మైనేని వాణి, యానల ప్రభాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement