Saturday, April 20, 2024

వరద బాధితుల గోడు ప్రభుత్వానికి పట్టడం లేదు.. బటన్‌ నొక్కడంతో బాధ్యత తీరిపోదు: పవన్‌ కల్యాణ్‌

అమరావతి, ఆంధ్రప్రభ: గోదావరి వరద తీవ్రత తగ్గుముఖం పట్టినా ముంపు బాధితుల ఇక్కట్లు రోజురోజుకీ పెరుగుతున్నాయని, ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో వందల గ్రామాల ప్రజలు వరద నీట మునిగి ఇబ్బందులు పడుతున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వేల మంది బాధితులు ఉంటే నామమాత్రంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు- చేయడం చూస్తే వైసీపీ ప్రభుత్వం వరద పరిస్థితులపై ఏ మాత్రం అప్రమత్తంగా లేదని అర్థమవుతోందని విమర్శించారు.

బటన్‌ నొక్కితే బాధ్యత తీరిపోయిందని వైసీపీ నాయకత్వం భావిస్తోందని, అలా కాకుండా మానవత్వంతో స్పందించి సహాయ చర్యలు చేపట్టాలని, అయితే వరద బాధితుల గోడును పాలకులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. బాధితులను ఆదుకోవాలని కోరితే రాజకీయం చేస్తున్నామని వైసీపీ నాయకత్వం చెప్పడం ద్వారా వైఫల్యాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. ముంపు గ్రామాల ప్రజలను తరలించేందుకు కనీసం పడవలు కూడా ప్రభుత్వ సమకూర్చలేకపోయిందని, ఆహారం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రెండేళ్ల కిందట వచ్చిన వరదల సమయంలో పడవలు, ఆహారం సమకూర్చినవారికి నేటికీ బిల్లులు చెల్లించకపోవడం వల్లే ఈ పరిస్థితులు వచ్చాయని అన్నారు. ప్రస్తుతం నీట మునిగిన ఇళ్ళల్లోనే వరద బాధితులు బితుకుబితుకుమంటూ సహాయం కోసం చూస్తున్నారని, పసి పిల్లలకు కనీసం పాలు కూడా అందటం లేదనే విషయం నా దృష్టికి వచ్చిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అన్నపూర్ణలాంటి కోనసీమ ప్రాంతంలో ఆహార పొట్లాల కోసం పెనుగులాడుకొనే పరిస్థితి కల్పించారన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి, నిర్వాసితులు, వరద బాధితులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. జనసేన పార్టీ నేతలు, జన సైనికులు- ఇప్పటికీ ముంపులో ఉన్న గ్రామాల్లో సహాయ చర్యల్లో నిమగ్నమై ఉన్నారని, ఆహారం, పాలు, కూరగాయలు అందిస్తున్నారని, వారి సేవలు అభినందనీయమని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement