ఒడిశాలో ఓ సరుకు రవాణా రైలు ప్రమాదానికి గురైంది. ఫిరోజ్నగర్ నుంచి ఖుర్దా రోడ్కు వెళ్తున్న సరుకు రవాణా రైలు ఒడిశాలోని అంగుల్ రైల్వేస్టేషన్ దాటిన తర్వాత తాల్చేర్ రోడ్కు రెండు కిలోమీటర్ల దూరంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో రైలులోని 9 వ్యాగన్లు బోల్తాపడ్డాయి. మరో వ్యాగన్ పట్టాలు తప్పి నిలిచిపోయింది.
మంగళవారం తెల్లవారుజామున 2:35 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ఈస్ట్కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు. తాల్చేర్ రోడ్డుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఓ నది వంతెనపై రైలు పట్టాలు తప్పిందని, అయితే రైల్లోని ఒక్క వ్యాగన్ కూడా నీళ్లలో పడలేదని రైల్వే అధికారులు చెప్పారు. అదేవిధంగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని, ఎవరికీ గాయాలు కూడా కాలేదని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.