Wednesday, April 24, 2024

రెవెన్యూ సంస్కరణలతో సత్ఫలితాలు.. భూముల రీసర్వే విధానంతో ఎంతో మేలు

అమరావతి, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రజలకు పారదర్శక పాలన అందిస్తోందని రెవెన్యూ శాఖలో చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలివ్వడం ఇందుకు నిదర్శనమని రెవెన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. విజయవాడలో శుక్రవారం కోస్తాంధ్ర జిల్లాలకు చెందిన రెవెన్యూ అధికారుల ప్రాంతీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భూముల రీసర్వే విధానం ద్వారా గత 70 ఏళ్ళగా ఎవరూ చేయని సాహసం చేసి రీసర్వే ద్వారా ఇంటి స్థలాలు, 22ఏ చుక్కల భూముల వివాదాలను పరిష్కరించగలిగామని చెప్పారు. ఇదే విధానాన్ని కొనసాగించి ప్రజలకు సుపరిపాలన అందించడంలో రెవెన్యూ అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం (రీసర్వే), ఇడ్ల పట్టాల పంపిణీ, 22ఏ కేసులు, చుక్కల భూముల వివాదాలు, సాదా బైనమా, ఆర్వోఆర్‌, ఆర్వోఎస్‌ఆర్‌ పట్టా, నాలా, ఆక్రమణ భూముల క్రమబద్దీకరణ, ఆనాదీన భూములు, ఈ-పంట తదితర అంశాలపై సదస్సులో చర్చించి మరింత సమర్థవంతంగా రెవెన్యూ సేవలను ప్రజలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, . ఏ దేశమైనా.. రాష్ట్రమైనా… ఏ ప్రాంతమైనా…. అభివృద్ధి చెందాలంటే ఆయా ప్రాంతాల భూముల వినియోగంపై ఆధారపడి ఉంటు-ందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ తల్లిలాంటిదన్నారు. ప్రభుత్వ శాఖలకు అవసరమైన భూములను, రెవెన్యూను సమకూర్చడం ద్వారా రెవెన్యూ శాఖ తన భాధ్యతను భుజాన వేసుకుంటు-ందన్నారు.

- Advertisement -

ప్రభుత్వ అవసరాలు, లక్ష్యాలు, విధానాలను చేరువ చేసేందుకు రెవెన్యూ శాఖాధికారులు సమష్టి కృషి ద్వారానే సాద్యపడుతుందన్నారు. రెవెన్యూ శాఖకు జవసత్వాలను తీసుకువచ్చి సంస్కరణలను చేపట్టడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజల అవసరాలను తీర్చాలన్నదే ఏకైక లక్ష్యాంగా పని చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. భూముల రీసర్వే ఇంటి స్థలాల పంపిణీ, 22 ఏ వివాధాలు, చుక్కల భూముల వివాధాలు, సాదా బైనమా, ఆర్వోఆర్‌ చట్టం, మ్యూటేషన్ల పరిష్కారంలో జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, తీసుకున్న చర్యలు అభినందనీయమన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలవారికి సొంత ఇంటి కలను నెరవేరుస్తున్నామని 32 లక్షల మంది లబ్దిదారులకు ఇండ్ల పట్టాలను అందించగలిగామని, ఇందుకు దాదాపు 12 వేల కోట్లకు పైగా భూముల సేకరించేందుకు చెల్లించామని మంత్రి తెలియజేశారు. అసైన్డ్‌ భూములపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక కమిటీని నియమించారని, ఇతర రాష్ట్రాల్లో అసైన్డ్‌ భూములపై తీసుకున్న చర్యలను కమిటీ- అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తుందని అనంతరం అసైన్డ్‌ భూములపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటు-ందని తెలిపారు.

ఇకపై గ్రామ, వార్డు సచివాలయాలు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలే..

ఇకపై ప్రతీ గ్రామ, వార్డు, సచివాలయం ఒక రిజిస్ట్రార్‌ కార్యాలయంగా మారబోతుందని, తద్వారా భూముల రిజిస్ట్రేషన్లలో మరింత పారదర్శకమైన సేవలందించడమనేదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలియజేశారు. వెబ్‌ ల్యాండ్‌ ఎంట్రీలపై గతంలో కొన్ని విమర్శలు వచ్చేవని చెప్పారు. ప్రాధాన్యత ఉన్న శాఖపై విమర్శలు వస్తాయని అయితే రిజిస్ట్రేషన్‌ అయిన రోజే ఆటోమ్యూటేషన్‌ అయ్యేలా విమర్శలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంస్కరణల ఫలితాలను ప్రజలకు అందించడంలో రెవెన్యూ అధికారులు మరింత కృషి చేయాలన్నారు. సంస్కరణలో భాగంగా పరిపాలన వికేంద్రీకరణ చేయాలని గతంలో ఎన్నో ప్రభుత్వాలు కేవలం మాటలకే పరిమితం అయ్యాయని అయితే సీఎం జగన్‌ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలను తీసుకువచ్చి ప్రజల ముంగిటకే పారదర్శక పాలనను తీసుకువచ్చారని ప్రజలు ఈ విధానాన్ని ఎంతగానో స్వాగతిస్తున్నారన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పై మరింత పర్యవేక్షణ చేసి సమర్థవంతమైన రెవెన్యూ సేవలను ప్రజలకు అందించడంలో రెవెన్యూ అధికారులు కృషి చేయాలని మంత్రి ధర్మాన కోరారు.

ఈ సదస్సులో సీసీఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌, రెవెన్యూ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ, సిసిఎల్‌ఎ అదనపు కార్యదర్శి ఎయండి ఇంతియాజ్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ కమీషనర్‌, ఐజి రామకృష్ణ, కృష్ణ, అడిషనల్‌ ఐజీ ఎం ఉదయ భాస్కర రావు, ఎన్టీఆర్‌ జిల్లా, ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల, పోట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల కలెక్టర్లు పి. రంజిత్‌ బాషా, ఎస్‌ డిల్లీరావు, ప్రసన్నవెంకటేష్‌, పి. ప్రశాంతి, కె. మాధవిలత, యం వేణుగోపాలరెడ్డి, ఎల్‌. శివశంకర్‌, ఎఎస్‌ దినేష్‌ కుమార్‌, కె. విజయకృష్ణన్‌, కె. విఎన్‌ చక్రధరబాబు ఆయా జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, ఆర్డివోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement