Thursday, April 25, 2024

ఆ ఓటమితో భారత్‌కు మేలు

ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌లో ఓడిపోయిన పాకిస్థాన్‌కు గట్టి దెబ్బ తగిలింది. ఈ ఓటమితో వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) 2021-23 ఫైనల్‌ చేరాలని ఉవ్వీళ్లూరుతున్న బాబర్‌ ఆజం టీమ్‌కు అవకాశాలను సంక్లిష్టం చేసింది. అలానే ఇది భారత్‌కు కూడా మేలు చేసింది. టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరే అవకాశాలు మరింత మెరుగయ్యాయి.

డబ్ల్యూటీసీ ప్రస్తుత సీజన్‌లో భాగంగా పాకిస్థాన్‌ ఈ సిరీస్‌ ఆరంభానికి ముందు పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇంగ్లడ్‌తో భారీ పరాజయం తర్వాత కూడ పాక్‌ అదే స్థానంలో ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా, టీమ్‌ ఇండియా విజయాలతో పోలిస్తే మరింత వెనుకబడి ఉంది. దీంతో ఫైనల్‌ చేరాలంటే మిగిలిన మ్యాచ్‌లలో తప్పక గెలవడం సహా ఇతర జట్ల తాజా సిరీస్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి వచ్చింది.

కాగా బంగ్లాదేశ్‌తో జరగబోయే టెస్ట్‌ సిరీస్‌ను టీమ్‌ ఇండియా 2-0తో గెల్చుకుని ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీస్ లో ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఓడిపోకపోతే భారత్‌ టాప్‌ 2 ప్లేస్‌లో నిలిచే అవకాశం కూడా ఉంది.

- Advertisement -

పేసర్‌ హరీష్‌ రౌఫ్‌ దూరం

పాకిస్థాన్‌ జట్టు పేసర్‌ హరీస్‌ రౌఫ్‌ గాయం కారణంగా సిరీస్‌లో మిగిలిన రెండు టెస్ట్‌లకు దూరమయ్యాడు. ఈ చారిత్రాత్మక టెస్ట్‌లో మొదటి రోజు ఫీల్డింగ్‌ చేస్తుండగా రౌఫ్‌ కుడి కాలికి గాయమైంది. అనంతరం అతడిని ఆస్పత్రి తరలించి స్కాన్‌ చేయించగా గాయం తీవ్రమైనదిగా తేలింది. దీంతో అతడికి దాదాపు నెలరోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే హరీస్‌ మిగిలిన రెండు టెస్ట్‌లకు దూరమయ్యాడు. ఇక గాయపడిన రౌఫ్‌ స్థానంలో ఫహీమ్‌ అష్రఫ్‌ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే స్టార్‌ పేసర్‌ షాహిన్‌ షా అఫ్రిది గాయం కారణంగా దూరం కాగా ఇప్పుడు రౌఫ్‌ దూరం కావడం పాక్‌ను కలవరపెడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement