Wednesday, April 24, 2024

NDA నుంచి మరో పార్టీ అవుట్

కేంద్రంలో అధికారంలో ఉన్న నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) కూటమికి మరో ప్రాంతీయ పార్టీ షాక్ ఇచ్చింది. NDA నుంచి వైదొలుగుతున్నట్లు గోవాకు చెందిన గోవా ఫార్వర్డ్ పార్టీ (GFP) ప్రకటించింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారు గోవాలో విభజన రాజకీయాలకు పాల్పడుతున్నందుకు నిరసనగానే తాము వైదొలగుతున్నట్టు జీఎఫ్ పీ అధ్యక్షుడు విజయ్ సర్దేశాయ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన NDA ఛైర్మన్ అమిత్ షాకు లేఖ రాశారు. గోవా ప్రయోజనాలను కాపాడడంలో NDA దారుణంగా విఫలమైందని విమర్శించారు. గోవా ప్రజలు సొంత రాష్ట్రంలో పరాయివాళ్లలా మారిపోయారంటూ అందుకు బీజేపీ విధానాలే కారణమని ఆరోపించారు. గోవా వ్యతిరేక విధానాలను పునరావృతం చేస్తూ, కొందరికి మేలు చేసేలా, మరెందరికో నిరాశ కలిగించేలా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.

హిందువుల పండుగ గుడీ పడ్వా సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో GFP ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. NDA నుంచి వైదొలగాలన్న తీర్మానానికి పార్టీ కార్యనిర్వాహక సభ్యులందరి మద్దతు లభించింది. కాగా ఇప్పటికే NDA నుంచి అకాలీదళ్, రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ దూరం జరిగిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement