Friday, April 19, 2024

గుంటూరు జిల్లాలో దారుణం.. యువతిపై గ్యాంగ్ రేప్

తాడేపల్లి పరిధిలోని సీతానగరంలో దారుణం చోటు చేసుకుంది. సీతానగరం పుష్కర ఘాట్ల వద్ద నదీ తీరంలో సేదతీరుతున్న ప్రేమజంటపై దుండగులు దాడి చేసి ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. తన కాళ్ళు, చేతులు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. అనంతరం నిందితులు పడవలో విజయవాడ వైపు వెళ్లిపోయారని సమాచారం. కాగా బాధితురాలిని వైద్య పరీక్షలు నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికే కొంతమంది స్థానిక యువకులను జరిగిన ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా బాధితురాలు కాబోయే భర్తతో కలిసి కృష్ణ నదిలోని పుష్కర ఘాట్ వద్దకు వెళ్లిందని యువతి బంధువులు వెల్లడించారు. బ్లేడ్ బ్యాచ్‌లోని ముగ్గురు ఆ ఇద్దరిపై దాడి చేసి సామూహిక అత్యాచారం చేశారని ఆరోపించారు. వాళ్లిద్దరి కాళ్లు, చేతులు కట్టేశారని, బాధితురాలు ఫోన్ చేసి చెప్పడంతోనే తాము నది దగ్గరకు వెళ్లామని, పోలీసులు నదిలో మూడు గంటల సేపు నిందితుల కోసం గాలించారని తెలిపారు. నిందితుల్లో ఒకరి ఫోటో సేకరించారని, ప్రస్తుతానికి బాధితురాలు మాట్లాడలేని స్థితిలో ఉందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement