హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో రేపటి నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో నెంబర్ 5ను జారీ చేశారు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు, మాన్యువల్గా పదోన్నతులు జరుగుతాయిని అందులో ఆమె స్పష్టం చేశారు. రేపు (శుక్రవారం) కేటగిరీ ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల(హెచ్ఎం) పదోన్నతికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్ల (ఎస్ఏ) సీనియారిటీ జాబితాను ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఈనెల 28వ తేదీ నుంచి 30 వరకు బదిలీల కోసం ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. అయితే దీనికి మూడు రోజులు మాత్రమే గడువు విధించడం గమనార్హం. దరఖాస్తు చేసుకున్న హార్డ్ కాపీలను ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు, ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికొన్నత ఉపాధ్యాయులు సంబంధిత ఎంఈఓలకు, మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు సమర్పించాలి.
అలాగే హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సంబంధిత జిల్లా డీఈఓకు ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 2వ తేదీలోపు సమర్పించాలి. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 6 వరకు దరఖాస్తలు హార్డ్ కాపీలను డీఈవో కార్యాలయంలో సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు సమర్పించిన తర్వాత దరఖాస్తుల పరిశీలన, ఆన్లైన్లో ఆమోదం జరుగుతాయి. ఫిబ్రవరి 7న డీఈఓ, ఆర్జేడీ వెబ్సైట్లలో బదిలీలు, పదోన్నతుల కోసం సీనియారిటీ జాబితా ప్రకటిస్తారు. ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు సీనియారిటీ జాబితాపై 3 రోజుల అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరిస్తారు. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో తుది సీనియారిటీ జాబితాల ప్రకటనతోపాటు, ప్రధానోపాధ్యాయుల బదిలీలకు వెబ్ ఆప్షన్ల నమోదు ఉంటుంది. ఫిబ్రవరి 13న మల్టి జోనల్ స్థాయిలో ప్రధానోపాధ్యాయుల వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్, పున:పరిశీలన చేస్తారు. ఫిబ్రవరి 14న ఆర్జేడీలు ప్రధానోపాధ్యాయుల బదిలీల ఉత్తర్వులు విడుదల చేస్తారు. అదేనెల 15న ప్రధానోపాధ్యాయుల బదిలీల అనంతరం మిగిలిన ఖాళీలను ప్రకటిస్తారు. ఈనెల 27 నుంచి మార్చి 4వ తేదీ దాకా 37 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది.
ఫిబ్రవరి 24న ఎస్ఏల బదిలీలు పూర్తి…
ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లకు ప్రభుత్వ, జిల్లా పరిషత్ యాజమాన్య పాఠశాలల హెచ్ఎంల పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 19, 20 తేదీల్లో సబ్జెక్టుల వారీగా స్కూల్ అసిస్టెంట్ల ఖాళీల ప్రకటన, బదిలీ ఆప్షన్స్ నమోదు ప్రక్రియ ఉంటుంది. ఫిబ్రవరి 21న ఆప్షన్ల సవరణ, పున:పరిశీలనకు టీచర్లకు అవకాశం కల్పిస్తారు. ఫిబ్రవరి 22, 23 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ల బదిలీకి డీఈఓలు ఉత్తర్వులు విడుదల చేస్తారు. ఫిబ్రవరి 24న ఎస్ఏ బదిలల అనంతరం ఏర్పడిన ఖాళీలను ప్రకటించనున్నారు.
ఫిబ్రవరి 25 నుంచి ఎస్జీటీలకు కౌన్సెలింగ్…
ఫిబ్రవరి 25 నుంచి 27 తేదీల్లో ఎస్జీటీ తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు కోర్టు కేసులు లేని సబ్జెక్టులకు మాన్యువల్గా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. తద్వారా ఎస్జీటీలకు ఎస్ఏలుగా పదోన్నతులు కల్పిస్తారు. ఫిబ్రవరి 28, మార్చి 1, 2 తేదీల్లో ఎస్జీటీ తత్సమాన పోస్టుల ఖాళీలు ప్రకటించి వెబ్ ఆప్షన్లు నమోదు చేయనున్నారు. బదిలీలన్నీ వెబ్ కౌన్సెలింగ్ విధానంలోనే నిర్వహించనున్నట్లు జీఓలో వాకాటి కరుణ స్పష్టం చేశారు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులను, మూడేళ్లుగా ఒకో చోట పనిచేస్తున్న టీచర్లను దరఖాస్తు చేసుకోకపోయినా బదిలీ చేయనున్నట్లు జీఓలో స్పష్టం చేశారు. 3ఏళ్లలో ఉద్యోగ విరమణ చేయనున్న టీచర్లను వారు కోరుకుంటే తప్ప బదిలీ చేయరని పేర్కొన్నారు. బాలికల పాఠశాలల్లో 50 ఏళ్లలోపు పురుష ఉపాధ్యాయులుంటే బదిలీ చేసి అక్కడ మహిళను నియమిస్తారు.
15 రోజుల్లో అభ్యంతరాలను పరిష్కరించాలి…
మార్చి 3న ఆప్షన్ల సవరణ, పున:పరిశీలనకు అవకాశం కల్పిస్తారు. మార్చి 4న ఎస్జీటీ తత్సమాన కేటగిరీ టీచర్లకు బదిలీ ఆర్డర్లు విడుదల చేస్తారు. మార్చి 5 నుంచి 19వ తేదీ వరకు డీఈఓ ఇచ్చిన బదిలీ ఉత్తర్వులపై అప్పీళ్లు, అభ్యంతరాలను ఆర్జేడీకి, ఆర్జేడీ ఉత్తర్వులపై అభ్యంతరాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్కు పంపాలి. దరఖాస్తు అందిన 15 రోజుల్లో సంబంధిత అధికారులు వాటిని పరిష్కరించాలి. బదిలీలు పొందిన టీచర్లు 2022-23 విద్యాసంవత్సరం చివరి పనిదినం రోజున బదిలీ అయిన పాఠశాలలకు వెళ్లాలి.