Tuesday, April 23, 2024

వజ్రోత్సవవేళ ఆర్టీసీ రాయితీలు.. 75ఏళ్లు పైబడిన వారికి ఫ్రీ టికెట్..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) రేపు (సోమవారం) పలు రాయితీలను అమలు చేస్తోంది. 75ఏళ్లు పైబడిన వారందరికీ సోమవారం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. సోమవారం పుట్టబోయే పిల్లలకు 12ఏళ్ల వయసు వచ్చే వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సజ్జన్నార్‌ తెలిపారు. వజ్రోత్సవాల్లో భాగంగా ఒక కేజీ లోపు కార్గో పార్సిళ్లకు సోమవారం అంతా ఉచిత రవాణా సౌకర్యం అందిస్తున్నామని తెలిపారు. వజ్రోత్సవాల సందర్భంగా నిజామాబాద్‌ పట్టణంలో మూడు రోజులపాటు ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రదర్శన నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా ముగ్గురు స్వాతంత్య్ర సమరయోధులను సన్మానిస్తున్నామని చెప్పారు.

వజ్రోత్సవాల సందర్భంగా రేపు ఉదయం 8.30 గంటలకు ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌ బస్‌భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని సంస్థ తెలిపింది. నిజాం రోడ్డు రవాణా విభాగంలో పనిచేసిన మాజీ ఉద్యోగులు, కురువృద్ధులు టీఎల్‌. నర్సింహ్మా(97), ఎం. సత్తయ్య (92)లను సన్మానిస్తున్నామని పేర్కొంది. సంస్థలో పనిచేస్తున్న ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను కూడా సంస్థ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌రెడ్డి ఇవ్వనున్నారని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement