హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : కేంద్ర ప్రభుత్వ పథకం కింద సంక్రాంతి పండుగకు రేషన్ బియ్యం పంపిణీ అంశంపై సందిగ్ధం వీడింది. రాష్ట్ర కోటాపై ఇప్పటివరకు స్పష్టత లేకపోయినా, కేంద్రం ప్రకటించిన ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆదేశాలిచ్చింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా ఆరు కిలోల చొప్పున బియ్యాన్ని అందిస్తూ వచ్చేది. కొవిడ్ ఆపత్కాలంలో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఒకరికి ఐదు కిలోల చొప్పున బియ్యాన్ని అందించగా దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 5 కిలోల చొప్పున బియ్యం కలిపి పది కిలోలు పంపిణీ చేశారు.
తాజాగా కేంద్ర ప్రభుత్వం 5 కిలోల ఉచిత బియ్యాన్ని మరో సంవత్సర కాలం పొడిగించింది. 7వ తేదీ నుంచి బియ్యాన్ని పంపిణీ చేస్తామని ప్రకటించినా కొత్త సాప్ట్nవేర్ డౌన్లోడ్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయని పంపిణీని నిలిపివేశారు. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అందించే బియ్యం వాటా కూడా తేలకపోవడంతో లబ్ధిదారులు నిరాశ చెందారు. తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు గతంలో పేదలకు అందించే ఆరు కిలోల్లో కిలో బియ్యం కోత పడింది.
దీనిపై స్పష్టత లేకపోయినా ప్రస్తుతం ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభించాలంటూ పైర సరఫరాల సంస్థ అధికారులు అన్ని జిల్లాలకు మార్గనిర్ధేశం చేశారు. గత నెల డిసెంబరు వరకు పది కిలోల ఉచిత బియ్యాన్ని అందుకున్న పేద బలహీనవర్గాలు తిరిగి పది కిలోలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.