Friday, March 29, 2024

ఎపి స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ స్కామ్ – న‌లుగురి అరెస్ట్..

అమ‌రావ‌తి – ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ కుంభకోణం స్కాంలో దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్ వేర్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ మాజీ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్ ఉన్నారు. అరెస్ట్ చేసిన నలుగురిని ఈడీ అధికారులు విశాఖపట్నంలోని స్పెషల్ పీఎంఎల్ఏ కోర్టులో హాజరుపరిచారు. వారికి న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కాగా, ఏపీలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు 2015లో సీమెన్స్-డిజైన్ టెక్ సంస్థలు అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో రూ.3,300 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో ప్రభుత్వ వాటా 10 శాతం కాగా, మిగతా 90 శాతం భాగస్వామ్య టెక్ సంస్థలు చెల్లించాల్సి ఉంది. ఆ మేరకు ప్రభుత్వం రూ.370 కోట్లు చెల్లించగా, అందులో రూ.241 కోట్లను పలు ఇతర కంపెనీలకు మళ్లించడంతో ఇది స్కాం రూపుదాల్చింది. ఈ నిధుల మళ్లింపు 2017-18లో జరిగినట్టు గుర్తించారు. జీఎస్టీ ఇంటెలిజెన్స్, ఐటీ శాఖ విచారణ జరపగా, ఎలాంటి సేవలు అందించకుండానే బోగస్ ఇన్ వాయిస్ లతో గోల్ మాల్ చేశారన్న విషయం గుర్తించారు. దీనిపై సీఐడీ విచారణ జరుపుతోంది. మనీలాండరింగ్ కోణం కూడా ఉండడంతో ఈడీ ఎంటరైంది.


ఇక ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన మిగతా ముగ్గురిలో ఒకరైన వికాస్ నాయక్ ఖన్వేల్కర్ పూణేలోని డిజైన్ టెక్ సిస్టమ్స్ లిమిటెడ్ ఎండీ కాగా, మరొకరు ముకుల్ చంద్ర అగర్వాల్. ముకుల్ చంద్ర పీవీఎస్పీ ఐటీ స్కిల్స్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్కిల్లర్ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ (చత్తర్ పూర్) సంస్థలకు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు. మరో నిందితుడు సురేశ్ గోయల్ ఎస్ఎస్ఆర్ఏ అండ్ అసోసియేట్స్ సంస్థకు చెందిన ఓ చార్టర్డ్ అకౌంటెంట్.

Advertisement

తాజా వార్తలు

Advertisement