ఆయన ఓ దేశానికి అధ్యక్షుడు..అయితే ఆయన అందరి అధ్యక్షుల మాదిరి కాదండోయ్..ఈయన రూటే సపరేటు. ఆయన తీసుకునే నిర్ణయాలు..అమలు పరిచే శాసనాలు అన్నీ కఠినంగానే ఉంటాయి. ఆయనే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ ఉంగ్. ఈయన పేరు వింటేనే అక్కడి వారి గుండె గుభేళ్ మనడం ఖాయం. అయితే నార్త్ కొరియాలో ఆహార సమస్య తీవ్రంగా ఉందని ఐరాస మానవ హక్కుల సంఘం నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను కిమ్ ఆమోదించలేదు. తమ దేశంలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెబుతూనే దేశ ప్రజలకు కిమ్ కొన్ని కీలక సూచనలు చేశారు.
2025 వరకు ప్రజలు తక్కువగా ఆహారం తీసుకోవాలని, చైనాతో సరిహద్దులు ఓపెన్ కావడానికి మరో మూడేళ్ల సమయం పడుతుందని, అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలని కిమ్ సూచించారు. ప్రస్తుతం అక్కడ ఆహార కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆహార ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అంతర్జాతీయ ఆంక్షలతో ఆ దేశం సతమతమవుతోంది. ఈ క్రమంలోనే ఆదేశ అధ్యక్షుడు కిమ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. లేదంటూనే ఈ రకమైన వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యతని సంతరించుకున్నాయి.