Tuesday, March 26, 2024

రైతు సంక్షేమమే కేసీఆర్ ధ్యేయం .. హరీశ్ రావు

సిద్ధిపేట : రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. సిద్ధిపేట శివారులోని రంగనాయక సాగర్ ఎడమ కాలువ ద్వారా రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మంగళవారం జెడ్పీ చైర్మన్ రోజాశర్మతో కలసి సాగు నీటిని విడుదల చేశారు. ఎడమ కాలువ ద్వారా మొదటి విడత 100 క్యూసెక్కులు, రెండవ విడత 300 క్యూసెక్కులు.. నారాయణరావుపేట-చిన్నకోడూర్ మండలాల్లోని పలు గ్రామాలు కలుపుకుని మొత్తం 512 క్యూసెక్కుల నీటిని నారాయణరావుపేట మండలం చెరువు, కుంటలు, వాగులు, వంకల్లోకి జలాలు విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు.

ఈ చెరువుల్లోకి నీరు చేరడంతో నారాయణరావుపేట మండల పరిధిలోని 4 గ్రామాల రైతులకు ఏంతో మేలు చేకూరనుందన్నారు. నారాయణరావుపేట మండలం పరిధిలో 41 వాటర్ బాడీస్ లలోని చెరువులు, చెక్ డ్యాములు, కుంటలు, వాగులు, వంకల ద్వారా 2840 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుందన్నారు. రంగనాయక సాగర్ ఎడమ కాలువ కింద నారాయణ రావుపేట, చిన్నకోడూర్ మండలాలు కలుపుకుని ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పూర్తయినట్లు, మైనర్ కెనాల్, సబ్ మైనర్ కెనాల్, పంట కాల్వల ద్వారా మొత్తం 70 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇటీవల పలు గ్రామాల రైతులు మంత్రిని కోరిన దరిమిలా చెరువులు, కుంటలు, వాగులు, వంకలను గోదావరి జలాలను విడుదల చేయాలని ఆయా గ్రామ రైతుల కోరిక మేరకు ఆ నీటిని విడుదల చేస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement