Friday, March 29, 2024

లాక్‌డౌన్ అంటూ నకిలీ జీవో.. నిందితుడి అరెస్ట్

తెలంగాణలో లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన తరహాలో న‌కిలీ జీవోను రూపొందించి వైర‌ల్ చేసిన యువ‌కుడిని పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు రోజుల క్రితం శ్రీపతి సంజీవ్‌ కుమార్‌ అనే వ్యక్తి ఈ నకిలీ జీవోను సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యేలా చేసిన‌ట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ మీడియా స‌మావేశంలో తెలిపారు. నిందితుడి నుంచి ఓ ల్యాప్‌టాప్‌, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నామ‌ని వివ‌రించారు. అత‌డి స్వస్థలం నెల్లూరు అని, ఓ ప్రైవేటు సంస్థ‌లో ఛార్టెడ్‌ అకౌంటెంట్‌గా ఇక్కడ పని చేస్తున్నాడని తెలిపారు. తెలంగాణ‌లో గ‌త ఏడాది లాక్‌డౌన్‌పై ప్ర‌భుత్వం ఇచ్చిన‌ జీవోను డౌన్‌లోడ్‌ చేసుకున్న శ్రీప‌తి అందులో మార్పులు చేసి కొత్త జీవోగా దాన్ని సృష్టించాడని అంజ‌నీ కుమార్ పేర్కొన్నారు. అనంత‌రం ఆ న‌కిలీ జీవోను సంజీవ్‌తో పాటు అతడి స్నేహితులు వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేశారని తెలిపారు. ఇటువంటి త‌ప్పుడు ప్ర‌చారాల‌ను ఎవ్వ‌రూ షేర్ చేయొద్ద‌ని, నిజాన్ని నిర్ధారించుకోకుండా షేర్ చేసిన వారిపైనా కేసులు న‌మోదు చేస్తామ‌ని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement