Saturday, April 20, 2024

పోలవరం డిజైన్లపై విస్తృత సమావేశం..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తలెత్తిన సమస్యలను సరిదిద్దడం కోసం ఢిల్లీలోని జలశక్తి శాఖ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. ప్రాజెక్టులో కీలకమైన ‘ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాం (ఈసీఆర్ఎఫ్)’ కోతకు గురవడంతో ఆ ప్రాంతాన్ని ఎలా పూడ్చాలన్న అంశంతో పాటు, వరద ఉధృతికి దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను ఎలా పటిష్టపర్చాలన్న అంశాలపై నిపుణులతో జలశక్తి శాఖ సలహాదారుడు వెదిరె శ్రీరామ్ అధ్యక్షతన సమాలోచలు జరిగాయి. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ సి. నారాయణ రెడ్డితో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓవో, సెంట్రల్ వాటర్ కమిషన్ ఉన్నతాధికారులు, డ్యామ్ డిజైన్ రివ్యూ ఫ్యానల్, కెల్లర్, బౌర్, సీఎస్ఎంఆర్ఎస్ వంటి సంస్థల ప్రతినిధులతో పాటు ఐఐటీ నిపుణులు హాజరయ్యారు.

ఈ నెల 11న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) డైరక్టర్ ఖయ్యూం అహ్మద్ నేతృత్వంలో అధికారుల బృందం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధ్యయనం చేసిన విషయం తెలిసిందే. నిర్మాణంలో క్రమానుసారం కాకుండా చేపట్టిన పనులకు తోడు భారీ వరదల కారణంగా డయాఫ్రం వాల్ దెబ్బతినగా, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కోతకు గురైంది. ఈ ప్రాంతాలను పరిశీలించిన కేంద్ర జల సంఘం అధికారుల బృందం ఓ నివేదికను రూపొందించి కేంద్ర జలశక్తి శాఖకు అందించింది. ఆ నివేదిక ఆధారంగా ప్రాజెక్టు నిర్మాణంలో తలెత్తిన ఈ లోపాలను ఎలా సరిదిద్దాలన్న అంశంపై జలశక్తి శాఖ సలహాదారుడు వెదిరె శ్రీరాం నిపుణుల అభిప్రాయాలు సేకరించారు. నిర్మాణ నాణ్యతలో రాజీపడకుండా, డ్యామ్ భద్రతకు పెద్దపీటవేస్తూ సరిదిద్దాల్సిన చర్యలపై సమావేశంలో ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలిసింది. అవసరమైతే మరోసారి ప్రాజెక్టును సందర్శించాలని కూడా సమావేశంలో నిర్ణయించినట్టు తెలిసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement