Thursday, March 28, 2024

త్వరలోనే లాల్ దర్వాజ అమ్మవారి ఆలయ విస్తరణ పనులు.. మంత్రి తలసాని

ఎంతో చరిత్ర కలిగిన ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజ అమ్మవారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం అసెంబ్లీలోని సమావేశ మందిరంలో ఎంఐఎం ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, బలాలతో కలిసి పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి వచ్చిన సందర్భంలో ఆలయం అభివృద్ధి, విస్తరణ చేపడతామని ప్రకటించారని గుర్తు చేశారు. ఆ హామీ మేరకు ఆలయ విస్తరణకు అవసరమైన 1100 గజాల స్థలాన్ని గుర్తించడం జరిగిందని, భూ యజమానులు కూడా స్థలం అప్పగించేందుకు సానుకూలంగా ఉన్నారని తెలిపారు.

ఆలయ అభివృద్ధి కోసం భూమి అప్పగిస్తున్న వారికి పరిహారంగా అందించేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం 8.95 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని చెప్పారు. అదేవిధంగా పేద ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పెండ్లిళ్ళు, ఇతర శుభకార్యాలు జరుపుకునేందుకు మూడు నూతన మల్టి ఫర్పస్ ఫంక్షన్ హాల్స్ నిర్మాణం కోసం 19 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. ఇందులో కంచన్ బాగ్, ఉప్పుగూడ, జంగంమెట్ లలో మల్టి ఫర్పస్ ఫంక్షన్ హాల్స్ నిర్మించడం జరుగుతుందన్నారు. ఉప్పుగూడ హాల్ కు టెండర్ ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన రెండు హాల్స్ కు కూడా త్వరితగతిన టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 10 రోజుల్లో భూమిపూజ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, కలెక్టర్ అమయ్ కుమార్, దేవాదాయ శాఖ కమిషనర్ అనీల్ కుమార్, జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్స్ సీఈ జియా ఉద్దీన్, జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement