హైదరాబాద్,ఆంధ్రప్రభ: ఆసఫ్జాహీ రాజుల కాలంలో అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన క్రీడారంగానకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తెలంగాణ చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలు ఇస్తున్నాయి. నియోజకవర్గాల వారిగా క్రీడా ప్రాంగణాల నిర్మాణాలకోసం నిధులు కేటాయించింది. 1870 నిజాం రాజులు కుస్తీ పోటీలు నిర్వహించి హైదరాబాద్ రాజ్యాన్ని అంతర్జాతీయంగా నిలిపారు. అనేక మంది పహల్వాన్ లను తయారుచేసిన నిజాం రాజుల అనంతరం ఆ క్రీడా సంప్రదాయం కొనసాగింది. గుర్రపు పందాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆరవ నిజాంమీర్ మహబూబ్ అలీఖాన్ సిద్ధిఖీ హైదరాబాద్ లో గుర్రపు పందాలకోసం రేస్ కోర్సు నిర్మించారు. లాల్బహుద్దూర్ స్టేడియం(ఫతేమైదాన్), సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లను నిర్మించి జాతీయ, అంతర్జాతీయ క్రీడలు నిర్మించారు. అదే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం పంచాయితీల వారిగా క్రీడా మైదానాల ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే ఉన్నమైదానాలను మరింత ఆధునీకరించి కొత్తహంగులు అద్దుతుంది.
రాష్ట్రంలో 119 క్రీడా ప్రాంగణాలను నిర్మించి జాతీయ స్థాయి క్రీడలను ప్రాత్సహించేందుకు బడ్జెట్ కేటాయింపులు చేసింది. నియోజవర్గానికి ఒకటి స్టేడియం నిర్మించి అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ లో జరిగే క్రీడలను లైవ్ ద్వారా చూసేందుకు ప్రత్యేక థియోటర్ల ను నిర్మింస్తుంది. అలాగే ప్రత్యేకంగా క్రికెట్ కోసం మైదానం, జిమ్నాస్టిక్స్, ఫుడ్ బాల్, వాలిబాల్, కుస్తీ, షూటింగ్, జావలిన్ క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 119 స్టేడియాల్లో ఇప్పటికే నిర్మల్, ముథోల్, బోధన్, నిజమాబాద్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల, ఆందోల్ నియోజకవర్గాల్లో స్టేడియాల నిర్మాణాలు చివరిదశకు చేరుకున్నాయి.
ఒక్కో స్టేడియంలో సుమారు 15 వేల మందికి సౌకర్యాలను సమకూర్చారు. ఆధునిక అంగులు అద్దుతున్నారు. త్వరలో ఈ స్టేడియాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నట్లు అధికారులు చెప్పారు. మరో 23 స్టేడియాలకోసం క్రీడా శాఖ డిపిఆర్ లను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. మిగతాక్రీడా ప్రాంగణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రతి క్రీడా ప్రాంగణానికి 5 ఎకరాల స్థల సేకరణ జరిగింది. ఇప్పటి వరకు రూ. 230 కోట్లు ప్రభుత్వం ఖర్చుచేయగా 114 పనులు జరగుతున్నాయి.
రాష్ట్రంలో కొత్త స్టేడియాల నిర్మాణం కోసం రూ. 30 కోట్లు ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించింది.
అలాగే క్రీడాకారుల ప్రోత్సాహం కోసం రూ. 15 కోట్లను ప్రభుత్వం నిధులు సమకూర్చింది.
అలాగే రాష్ట్రంలోని 13వేల గ్రామాలకు క్రీడా మైదానాల నిర్మాణాల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. స్థానిక సంస్థల ఆధ్వర్యంలో గ్రామీణ మైదానాలు రూపుదిద్దుకుంటున్నాయి. క్రీడారంగాభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.134 కోట్ల తో పనులు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం 28 రాష్ట్రలకు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ. 1000కోట్లు కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రం 134 కోట్లు కేటాయించి క్రీడా మైదానాలపై దృష్టి సారించింది. ఇప్పటికే హరతహారం తో పచ్చబడిన తెలంగాణ లో పల్లెలు ప్రగతి సాధిస్తుంటే ఊరికో ఆటస్థలం, నియోజకవర్గానికో స్టేడియం నిర్మాణాలను చేపట్టి అంతర్జాతీయ క్రీడా మైదానాల్లో తెలంగాణ బావుటా ఎగరవేసేందుకు సిద్ధమైంది.