Friday, March 29, 2024

దేశంలో భారీగా పడిపోయిన విద్యుత్ డిమాండ్

కరోనా నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలలో లాక్‌డౌన్ అమలు చేస్తుండటంతో విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పడిపోతోంది. ఏప్రిల్‌ రెండో అర్ధభాగంతో పోలిస్తే మే నెల తొలి అర్ధభాగంలో దేశ విద్యుత్‌ వినియోగం 6.2 శాతం పడిపోయింది. ఫెడరల్ గ్రిడ్ రెగ్యులేటర్, పోసోకో (పవర్‌ సిస్టమ్‌ ఆపరేషన్‌ కార్పొరేషన్‌) గణాంకాల ప్రకారం ఏప్రిల్‌ నెల రెండో అర్థ భాగంలో 3,910 బిలియన్‌ యూనిట్లతో పోల్చితే.. మే నెల మొదటి 16 రోజుల్లో రాష్ట్రాల్లో మొత్తం రోజువారీ సగటు విద్యుత్‌ సరఫరా 3,666 బిలియన్‌ యూనిట్లకు పడిపోయింది.

దేశంలో వార్షిక విద్యుత్‌ వినియోగం పరిశ్రమలు, కార్యాలయాల్లోనే సగానికిపైగా ఉంది. భారత్‌లో విద్యుత్‌ ఉత్పత్తి సాధారణంగా ఏప్రిల్‌ నుంచి పెరగడం ప్రారంభం అవుతుంది. వేసవి దృష్ట్యా ఎయిర్‌ కండిషన్ల వినియోగించే అవకాశం ఉండడంతో మేలో భారీ డిమాండ్‌ ఉంటుంది. రెండు దక్షిణాది రాష్ట్రాలు, రెండు ఈశాన్య రాష్ట్రాలు మినహా విద్యుత్ వినియోగం అంతకు ముందు ఏడాది కంటే ఎక్కువగా ఉందని పోసోకో డేటా చూపింది. గతేడాది ఏప్రిల్‌ మే నెలల్లో కేంద్రం జాతీయ లాక్‌డౌన్‌ విధించగా.. సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌పై కేంద్రం వెనక్కి తగ్గింది. అయినా, పలు రాష్ట్రాలలో ఆంక్షలు విధించారు. కాగా 2020 చివరిలో విద్యుత్‌ డిమాండ్‌ పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement