Thursday, April 18, 2024

మారుమూల అటవీ ఆవాసాలకు విద్యుత్‌ సౌకర్యం.. జిల్లా క‌లెక్ట‌ర్ల నేతృత్వంలో క‌మిటీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మారుమూల అటవీ ప్రాంతాలకు కూడా విద్యుత్‌ సధుపాయం అందించాలన్న ప్రభుత్వం నిర్ణయం మేరకు వేగంగా అనుమతులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. మంగళవారం అరణ్యభవన్‌లో అటవీ, గిరిజన, విద్యుత్‌ శాఖల ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. సంబంధిత జిల్లాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ పనుల పురోగతిని అధికారులు సమీక్షించారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా 232 అవాసాలకు త్రీఫేజ్‌ విద్యుత్‌ సదుపాయం కల్పించాల్సి ఉందని అధికారులు తెలిపారు. సిఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ ప్రకియ వేగంగా కొనసాగుతుందని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్తు వెల్లడించారు. నిబంధనల మేరకు అనుమతుల ప్రక్రియ పూర్తి చేసేందుకు అటవీ శాఖ వేగంగా స్పందిస్తుందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్‌ష హెడ్‌ అఫ్‌ ఫారెస్టు ఫోర్స్‌ ఆర్‌. ఎం. డోబ్రియల్‌ అన్నారు.

రక్షిత అటవీ ప్రాంతాలకు బయట 50 ఆవాసాలు ఉన్నాయని సంబంధిత జిల్లాకలెక్టర్ల నేతృత్వంలోని కమిటీ అనుమతితో పనులు మొదలు పెట్టవచ్చని ఆయన అన్నారు. అదిలాబాద్‌, నిర్మల్‌, అసిఫాబాద్‌, మంచిర్యాల, భద్రాది కొత్తగూడెం, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లోని 182రక్షిత అటవీప్రాంతాల్లోని ఆవాసాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించాల్సివుందన్నారు. అన్ని రకాల అనుమతులు వేగవంతం చేసి త్వరగా పనులు పూర్తి చేయాలని సమావేశంలోనిర్ణయించామన్నారు. ఈ సమావేశంలో అదనపు పీసీసీఎఫ్‌లు మోహన్‌ చంద్ర పర్గెయిన్‌, ఏ.కె. సిన్హా, సంబంధిత జిల్లాలకు చెందిన చీఫ్‌ కన్జర్వేటర్లు, టైగర్‌ రిజర్వు కేంద్రాల ఫీల్డు డైరెక్టర్లు , జిల్లాల అటవీ అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement