న్యూఢిల్లి : రాజ్యసభలో 57 స్థానాలకు త్వరలో గడువు ముగియ నున్నది. వీటిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరు స్థానాలు ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్ నాలుగు స్థానాలు, తెలంగాణలో రెండు సీట్లు ఉన్నాయి.15 రాష్ట్రాల్లో ఈ 57 సీట్ల భర్తీ కోసం ఎన్నికలను నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 24వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 11 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, మహారాష్ట్ర, తమిళనాడులలో ఆరేసి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 10వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లోవి విజయసాయిరెడ్డి (వైసీపీ), టిజి వెంకటేష్, సుజనా చౌదరి (బీజేపీ)ల పదవీ కాలం, తెలంగాణలో డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు (తెరాస)ల పదవీ కాల పరిమితి జూన్ 20వ తేదీతో పూర్తి కానున్నది. నామినేషన్ల స్వీకరణకు గడువు మే 31 తేదీ, నామినేషన్ల పరిశీలన జూన్ ఒకటవ తేదీ, నామినేషన్ల ఉపసంహరణకు గడువు జూన్ 3వ తేదీ, పోలింగ్ జూన్ 10వ తేదీ, అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తారు.
రాజ్యసభలో ఖాళీ అయిన సీట్లు అధికార పార్టీకే తిరిగి లభించడం ఖాయంగా కనిపిస్తోంది. అసెంబ్లిలో అధికార పార్టీల మెజారిటీని బట్టి వాటిని అవే సొంతం చేసుకోవచ్చు. ఈ సీట్ల కోసం అధికార పార్టీలో ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారిలో ఎవరెవరికి టికెట్లు లభిస్తాయన్నది కొద్ది రోజుల పాటు ఆసక్తికర కథనాలకు ఇతివృత్తం కానుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి