Friday, March 29, 2024

ముందస్తు సాగుకు సై.. అకాల నష్టం నివారిద్ధాంసీఎం : కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పోరాటాలు, త్యాగాలతో,ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో అప్రతిహత విజయంతో పదేళ్లకు చేరుకున్న ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రజలకు వివరించాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. అమరు ల త్యాగాలు స్మరిస్తూ, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా ఈ ఉత్సవాలను ఘనంగా జరపాలని సీఎం కేసీఆర్‌ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. జూన్‌ 2 నుంచి మూడు వారాల పాటు సాగే ఈ ఉత్సవాలు తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా..పండుగ వాతావరణంలో జరుపాలని అన్నారు.

దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నిమిత్తం కలెక్టర్లకు రూ. 105 కోట్ల నిధులు విడుదల చేయాల్సిందిగా ఆర్థిక శాఖను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. గురువారం డా.బిర్‌.అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యచరణ, ఏర్పాట్లపై దిశానిర్దేశం చేసేందుకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో…దేశానికే ఆదర్శంగా తెలంగాణ హరితహారం సాధించిన విజయాలను సీఎం కేసీఆర్‌ వివరించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వరి పంట నాట్లను ఇప్పుడు అనుసరిస్తున్న ధోరణిలో కాకుండా ముందస్తుగా సకాలంలో నాటు వేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలగురించి వివరించారు.

ఇలా చేద్ధాం…

- Advertisement -

దశాబ్ధి ఉత్సవాల నిర్వహణ కీలక ఎజెండాగా ఏర్పాటు చేసిన కలెక్టర్ల సమావేశంలో తెలంగాణ ఏర్పడే నాటికి ఉన్న పరిస్థితులను పదేండ్లకు చేరుకున్న స్వరాష్ట్ర పరిపాలనలో సాధించిన గుణాత్మక అభివృద్ధిని సీఎం కేసీఆర్‌ రంగాల వారిగా కళ్లకు కట్టినట్లుగా వివరించారు. ఏ రోజుకారోజుగా రోజువారీ కార్యక్రమాలను వివరిస్తూ ఆయారోజు చేపట్టే శాఖలు, సాధించిన అభివృద్ధిని వివరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన ప్రజాసంక్షేమ కోణాన్ని, తాత్విక ధోరణి, దాని వెనకున్న దార్శనికతను కలెక్టర్లకు సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా అవగతమయ్యేలా వివరించారు.

జూన్‌ 2నుంచి 22 వరకు…

ఈ సందర్భంగా గ్రామ స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు జూన్‌ 2 నుంచి 22 వరకు ఏరోజున ఏ కార్యక్రమం చేపట్టాలో కలెక్టర్లకు వివరించారు. ఈ మూడు వారాల ఉత్సవాల విశిష్టతను, ప్రాముఖ్యత వెనుక ఉన్న ప్రాశస్త్యాన్ని వివరించారు. గ్రామాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో వాటి నిర్వహణ గురించి సీఎం కేసీఆర్‌ సమావేశంలో అంశాల వారీగా లోతుగా విశదీకరించారు. మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్లకు ఉద్బోధించారు. పదేండ్లకు చేరుకున్న ప్రగతి ప్రస్థానంలో ఆదర్శంగా నిలిచిన పలు ప్రభుత్వ శాఖలకు సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. వ్యవసాయం, విద్యుత్తు, సాగునీరు, ఆర్‌ అండ్‌ బీ తదితర శాఖల మంత్రులను, అధికారులను సీఎం కేసీఆర్‌ అభినందించారు.

నలు దిక్కులా తెలంగాణ విజయ ప్రస్తానం…

సీఎం కేసీఆర్‌ ఆదేశాలను అనుసరించి ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ సాధించిన అభివృద్దిని దేశం నలుదిక్కులా కనిపించేలా, తెలంగాణ గరిమ ప్రస్పుటించేలా చాటేందుకు, పండుగ వాతావరణంలో దశాబ్ధి ఉత్సవాలను నిర్వ#హంచేందుకు తాము ఈ మూడు వారాలు అవిరళ కృషి చేస్తామని కలెక్టర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ముఖ్యమంత్రి సలహాదారులు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, సిఎంఒ కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, డిజీపి, పోలీసు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

అన్ని రంగాల్లో సమ్మిళిత వృద్ధి…

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ…” కొన్ని దశాబ్దాల పోరాటాల తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం అందరం కలిసి సమిష్టి కృషితో అతి తక్కువ కాలంలోనే అన్ని రంగాల్లో సమ్మిళితాభివృద్ధిని సాధించుకున్నాం. నేడు తెలంగాణ వ్యవసాయం, ఐటి, పరిశ్రమలు, విద్యుత్‌ సహా అన్ని రంగాల్లో దేశంలోనే ముందంజలో ఉన్నాం. నూతన రాష్ట్రంగా ఏర్పడ్డ నాటికి మనకన్నా ముందంజలో నిల్చిన గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్‌, హర్యానాలను అధిగమించి తెలంగాణ ముందంజలోకి దూసుకుపోతున్నది. రాష్ట్రం వచ్చిననాడు కేవలం 8 లక్షల టన్నులు గా ఉన్న ఎరువుల వినియోగం నేడు 28 లక్షల టన్నులకు ఎదిగింది. ఒక పద్ధతి ప్రకారం ఎటువంటి ఇబ్భంది రాకుండా ఎరువులను, ఇతర వ్యవసాయ అవసరాలను రైతులకు అందుబాటులోకి తేవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించిన దార్శినిక విధానాలతోనే ఇది సాధ్యమైంది. నాడు గంజికేంద్రాలు నడిచిన పాలమూరులో నేడు పచ్చని పంటలతో పారే వాగులతో పాలుగారే పరిస్ఠితి నెలకొన్నది. ధాన్యం ఉత్పత్తిలో మనం పంజాబ్‌ను దాటేసి పోతున్నం.” అని సీఎం కేసీఆర్‌ వివరించారు.

ఉద్యమ నాయకత్వమే..స్వయం పాలనతో ప్రగతి సాకారం…

ఉద్యమ నాయకత్వమే స్వయంగా పాలన చేస్తే ప్రగతి సాధించడం కష్టం అనే అపోహను పటాపంచలు చేస్తూ ఎటువంటి భావోద్వేగాలకు గురికాకుండా పరిపాలనను నిర్థిష్ట లక్ష్యంతో ముందుకు కొనసాగించామని తెలిపారు. ఈ ఫలితంలో భాగమే నేడు దేశానికే ఆదర్శవంతమైన పాలనను అందించగలిగామని సీఎం కేసీఆర్‌ అన్నారు. నేడు విద్యా, వైద్య, రంగాల్లో తెలంగాణ అత్యద్భుత ఫలితాలను అందుకుంటూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. తెలంగాణ విద్యార్థులు నీట్‌, ఐఎఎస్‌ పోటీ పరీక్షల్లో దేశంలోనే ముందువరుసలో ర్యాంకులు సాధిస్తూ తెలంగాణ కీర్తిని చాటుతుండడం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వక్తం చేసి, విద్యార్థులను అభినందించారు. నారాయణ్‌ పేట్‌ ఎస్పీ వెంకటేశ్వర్లు కూతురు సివిల్‌ సర్వీసెస్‌లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకును సాధించిన నేపథ్యంలో సమావేశం అభినందనలు తెలిపింది.

వానాకాలం నారు రోహిణీ కార్తెలో.. యాసంగి నారు అనురాథ కార్తెలో…

గత పాలకుల నిర్లక్ష్యానికి కునారిల్లిపోయిన తెలంగాణ వ్యవసాయ రంగాన్ని నిలబెట్టాలనే దృఢ సంకల్పంతోనే వ్యవసాయ రంగ పునరుజ్జీవనమే ప్రధమ ప్రాధామ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. అందులో భాగంగా వ్యవసాయానికి బలమైన అనుబంధ వ్యవస్థలయిన చెరువులు, విద్యుత్తు, సాగునీరు తదితర రంగాలను బలోపేతం చేసుకున్నామన్నారు. తత్ఫలితమే నేడు మనం చూస్తున్న దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర అభివృద్ధి” అని అన్నారు. నేడు తెలంగాణలో ధాన్యం దిగుబడి 3 కోట్ల మెట్రిక్‌ టన్నులను దాటిపోతున్న నేపథ్యంలో అందుకు అనుగుణమైన చర్యలను రైతులను సమన్వయం చేసుకుంటూ జిల్లా కలెక్టర్లు ముందుకెళ్లాలని అన్నారు. ఇటీవలి కాలంలో కురిసిన అకాల వర్షాలు వడగండ్ల వానలు పర్యవసానంగా జరిగిన పంట నష్టంతో రైతుకు కలిగిన కష్టాలను గుణపాఠంగా తీసుకుని అందుకు అనుగుణంగా పంట విధానాలను మార్చుకోవాల్సిన అవసరమున్నదని అన్నారు.

”తాలు తక్కువ..తూకం ఎక్కువ”…

” ప్రాజెక్టులతో సాగు నీరు పుష్కలంగా అందుబాటులో ఉంది. 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు ఉంది. భూగర్భ జలాలులున్నాయి. ఆకాశం దిక్కు చూడకుండా కాల్వల నీళ్లతోని వరి నాట్లు పెట్టుకునే పరిస్థితి నేడు తుంగతుర్తి, సూర్యాపేట వంటి ప్రాంతాల్లో కూడా ఉంది. ఈ నేపథ్యంలో..మన రైతులు ముందస్తుగా నాట్లు వేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా యాసంగి నాట్లు ఆలస్యం కావడంతో కోతలు కూడా జాప్యమవుతున్నాయన్నారు. మార్చి 31 లోపే జరగాల్సిన కోతలు మే నెల దాటినా కొనసాగుతున్నయి. దాంతో ఎండాకాలంలో వచ్చే అకాల వర్షాలు వడగండ్ల వానలతో వరి పంటలు నష్టపోతున్న పరిస్థితి తెలెత్తుతుంది. ఈ బాధలు తప్పాలంటే నవంబర్‌ 15…20 తారీఖుల్లోపల యాసంగి వరినాట్లు వేసుకోవాల్సి ఉంటది. యాసంగి ముందు ముందే నాట్లు పడాలంటే వానకాలం వరినాటును కూడా ముందుకు జరుపుకోవాల్సి ఉంటుంది. అందుకోసం రోహిణీ కార్తె ప్రారంభంలోనే వానాకాలం వరినాట్లు మొదలు కావాలె. మే 25 నుంచి 25 జూన్‌ వరకు వానాకాలం వరినాట్ల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఈ దిశగా జిల్లా కలెక్టర్లు రాష్ట్ర రైతాంగాన్ని వ్యవసాయ శాఖ స#హకారంతో చైతన్యం చేయాల్సి ఏంటుంది.” అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

యాసంగిలో వరినారు నవంబర్‌ నెలలో అలికితే తీవ్రమైన చలికి నారు పెరగదనే అపో#హ రైతుల్లో ఉందని అదివాస్తవం కాదని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ” వరి తూకం పోసేటప్పుడు కాదు. వరి ఈనే సమయంలో చలి ఉండొద్దు. ఈనుతున్నప్పడు చలి వుంటే తాలు ఎక్కువయితది. ఎండలు ముదరకముందే వరి కోసుకుంటే గింజ గట్టిగ ఉండి తూకం కూడా బాగుంటది. ఇది రైతు సోదరులు గమనించాలె. వ్యవసాయశాఖ ఈ దిశగా రైతులను చైతన్యపరిచి అకాల వర్షాలతో పండిన పంటలు నష్టపోకుండా, ధాన్యం తడిసే పరిస్థితిలేకుండా..ముందుగానే నాట్లేసేకుని ముందస్తుగానే నూర్చుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలె..” అని వివరించారు. యాసంగి వరిని ముందుగా నాటుకుంటే… ”తాలు తక్కువయితది..తూకం ఎక్కువయితది” అని సిీఎం కేసీఆర్‌ రాష్ట్ర రైతాంగానికి పిలుపునిచ్చారు.

ఈ దిశగా వ్యవసాయ శాఖ తీసుకుంటున్న చర్యల వివరాలను సీఎం కేసీఆర్‌ ఆదేశాలమేరకు ఆశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి సమావేశంలో వివరించారు. 21 రోజుల పాటు జరిగే దశాబ్ధి ఉత్సవాలను జిల్లాల వారీగా వీడియో రికార్డు చేసి బధ్రపరచాలని సీఎం కేసీఆర్‌ కలెక్టర్లను ఆదేశించారు. అదే సందర్భంలో నియోజక వర్గాల వారీ, జిల్లాల వారీగా జరిగిన అభివృద్ధిని తెలిపే పదేండ్ల ప్రగతి నివేదిక పుస్తకాలను ముద్రించి అందచేయాలన్నారు. ఇప్పటికే నిర్ణయించిన మేరకు ఆయా రంగాల్లో సాధించిన అభివృద్ధిని చాటేలా డాక్యుమెంటరీలు రూపొందుతున్నాయని వాటిని ఈ ఉత్సవాల సంధర్భంగా ప్రదర్శించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement