Tuesday, March 26, 2024

వాస్తవాలను వక్రీకరించడం కేంద్ర హోంమంత్రి స్థాయికి తగదు: మంత్రి కేటీఆర్‌

సిరిసిల్ల: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాపై మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. సాయుధ పోరాటంలో పాలుపంచుకున్న మహారాష్ట్ర వాసులను ఎందుకు గుర్తించలేదని కేంద్రమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. వాస్తవాలను వక్రీకరించడం కేంద్ర హోంమంత్రి స్థాయికి తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో దళితబంధు పథకంలో భాగంగా మంజూరైన రైస్‌ మిల్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. లబ్దిదారులను రైస్ మిల్ యూనిట్ స్థాపన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనతరం మాట్లాడుతూ.. రైస్‌మిల్‌ను స్థాపించాలనుకోవడం గొప్పనిర్ణయమన్నారు. రైస్‌మిల్‌ యూనిట్‌ విజయవంతంగా నడవాలని, రాష్ట్రం మొత్తానికి ఇది ఆదర్శంగా నిలవాలని చెప్పారు. మిగతా లబ్దిదారులకు కేస్‌ స్టడీగా మారాలని ఆకాంక్షించారు.

సాయుధ పోరాటంలో పాలుపంచుకున్న మహారాష్ట్ర వాసులను ఎందుకు గుర్తించలేదని కేంద్రమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. సెప్టెంబర్‌ 17ను జాతీయ సమైక్యతా దినోత్సంగా జరిపామన్నారు. విమోచన దినంగా ఎందుకు జరపట్లేదని కొందరు అడుగుతున్నారని.. ఆగస్టు 15ను స్వాతంత్ర దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నామని ప్రశ్నించారు. త్యాగాలు, పోరాటాలను గౌరవప్రదంగా స్మరించుకోవడం ముఖ్యమని సూచించారు. పాత ఖైదీగా వ్యవహరించడం మాని.. భవిష్యత్‌ నిర్మాణంపై దృష్టి పెట్టాలని హితవుపలికారు.

అనంతరం మంత్రి కేటీఆర్‌ సిరిసిల్ల పట్టణంలో జరుగనున్న బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 3 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ పంచాయతీ ఆవార్డుల కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపరచిన 27 గ్రామ పంచాయతీలకు అవార్డుల ప్రదానోత్సవం చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement