Tuesday, April 23, 2024

టీ కాంగ్రెస్​లో మరోసారి బయటపడ్డ విబేధాలు..!

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తు ఇచ్చిన విష‌యం తెలిసిందే. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా య‌శ్వంత్ సిన్హాకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. అయితే య‌శ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ తెలంగాణ పార్టీలో అంతర్గత విబేధాలు మరోసారి బయటపడ్డాయి. కాంగ్రెస్ అధిష్టానం మ‌ద్ద‌తు ప‌లికినా తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ నేతలు య‌శ్వంత్ సిన్హాకు స్వాగ‌తం ప‌ల‌క‌లేదు. యశ్వంత్ పర్యటనను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సీఎం కేసీఆర్ విమానాశ్రయానికి వెళ్లి స్వయంగా యశ్వంత్ కు ఘన స్వాగతం పలికారు. జల విహార్ లో పరిచయ సభకు తన కారులోనే తీసుకెళ్లారు.

యశ్వంత్ హైదరాబాద్ పర్యటనకు దూరంగా ఉండాలని టీపీసీసీ నిర్ణయించుకుంది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాము యశ్వంత్ ను కలవబోమని ప్రకటించారు. రేవంత్ ఆదేశాల‌ను కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు లెక్క చేయడం లేదు. ఇప్పటికే సీనియర్ నేత వి.హనుమంతరావు.. ఎయిర్ పోర్టుకు వెళ్లి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికారు. మరోవైపు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. యశ్వంత్ ను కలిసేందుకు ఆయన అపాయింట్ మెంట్ కోరారు. సిన్హాకు కాంగ్రెస్ మద్దతిస్తున్నప్పుడు ఆయనను సీఎల్పీకి పిలిస్తే బాగుండేదని అన్నారు. సిన్హాను కలవొద్దని ప్రకటించిన రేవంత్, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్కను తప్పుపడుతూ జగ్గారెడ్డి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. తెలంగాణ కాంగ్రెస్ లో యశ్వంత్ పర్యటన ఏ పరిస్థితికి దారి తీస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement