Tuesday, April 23, 2024

తెలుగు వారినే ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలి: రవిబాబు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లకు స‌మయం ద‌గ్గ‌ర ప‌డ‌డంతో ప్ర‌కాష్ రాజ్, మంచు విష్ణు మ‌ద్ద‌తుదారులు ప‌ర‌స్ప‌రం మాట‌ల తూటాలు పేల్చుకుంటున్నారు. తాజాగా మంచు విష్ణుకు మ‌ద్ద‌తుగా న‌టుడు ర‌విబాబు మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ఈ ఎన్నిక‌ల్లో మా అధ్య‌క్షుడిగా తెలుగు వారినే ఎన్నుకోవాలని చెప్పాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అనేది తెలుగు న‌టుల కోసం ఏర్పాటు చేసుకున్న సంస్థ అని ఆయ‌న మాట్లాడాడు. మా సంస్థ‌ను న‌డిపేందుకు తెలుగు వారిలో ఒక‌రైనా ప‌నికిరారా? అని ఆయ‌న నిల‌దీశాడు.

ఇప్ప‌టికే నిర్మాత‌లు బ‌య‌టి నుంచే క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల‌ను తీసుకొస్తున్నార‌ని, వారి డిమాండ్ల‌కు ఒప్పుకుంటున్నార‌ని రవిబాబు ఆరోపించాడు. హైద‌రాబాద్‌లో దాదాపు 200 మంది కెమెరామెన్‌లకు ప‌ని లేదన్నాడు. ఇప్ప‌టికే బ‌య‌టినుంచి తెచ్చుకునే వారికి ఇచ్చే బిల్లులు చూసి నిర్మాత‌లు భ‌య‌ప‌డిపోతున్నారని పేర్కొన్నాడు. ముంబై నుంచే మేక‌ప్‌మెన్, హెయిర్ డ్రెస‌ర్లు వ‌స్తున్నారని, ఇప్ప‌టికైనా తెలుగు న‌టుల‌ను ప‌ట్టించుకోవాల‌ని ఆయ‌న కోరాడు. కాగా, ప్ర‌కాష్ రాజ్ నాన్ లోక‌ల్ అంటూ కొంద‌రు వ్యాఖ్య‌లు చేస్తోన్న విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement