Saturday, April 20, 2024

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే వారిని ఓడించండి : రేవంత్ రెడ్డి

నందిపేట్, మార్చి 17 (ప్రభ న్యూస్) : ముడుపుల కోసం కక్కుర్తిపడి అభివృద్ధిని అడ్డుకుంటున్న నాయకుల్ని ఓడించి బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నందిపేట మండలంలోని లక్కంపల్లి గ్రామ శివారులో ఉన్నటువంటి సజ్జ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు నష్టపోకుండా ఉండాలని 2008లో రైతుల దగ్గర నుండి భూములను తీసుకొని వారి పంటలు నష్టపోకుండా ఉండేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించిందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పరిశ్రమలు ఏర్పాటు చేయకపోగా.. ఏర్పాటు చేస్తామని వచ్చిన వారిని కూడా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని ఒక తెలంగాణ బిడ్డ మూడు నెలలు వేచి చూసి వెళ్లిపోయాడన్నారు. సజ్జ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి 30శాతం కప్పం చెల్లిస్తేనే సేజ్ భూముల్లో పరిశ్రమలు ఏర్పడటానికి అనుమతి లభిస్తుందని, ఒక ఎమ్మెల్యే పరిశ్రమల ఏర్పాటుకు ఆటంకంగా ఏర్పడ్డాడన్నారు. ఇదేనా తెలంగాణ అభివృద్ధి అంటే అని అన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబం అవినీతికి పాల్పడి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మహేష్ కుమార్ గౌడ్, తాహెర్ బిన్ ఉందన్, గడుగు గంగాధర్, పెంట ఇంద్రుడు, దేగా గంగారెడ్డి తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement