Tuesday, April 16, 2024

Death Pool – మ‌ద్యం మ‌త్తులో దూకాడు … ఆ త‌ర్వాత‌….

సికింద్రాబాద్ – స్విమ్మింగ్‌పూల్‌లో డైవ్ చేసి, ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఫతేనగర్ ప్రాంతానికి చెందిన సంపత్ , తన స్నేహితులతో కలిసి బోయిన్‌పల్లిలోని తెలంగాణ క్లబ్‌లో స్విమ్మింగ్ చేయడానికి వెళ్లారు. అయితే..వాళ్లందరూ ఈ పూల్‌కి రావడానికి ముందు పార్టీ చేసుకుని పూటుగా మద్యం సేవించారు. అనంత‌రం వారంతా స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్లి ఆడుకోవడం మొదలుపెట్టారు.

ఈ నేపథ్యంలోనే స్నేహితులు కలిసి డైవ్ చేసే పందెం వేసుకున్నారు. ఈ పోటీల్లో భాగంగానే సంపత్ ఆరు ఫీట్ల లోతు వద్ద డైవ్ చేశాడు. అంతే ఆ తర్వాత అతడు నీళ్లలోంచి బయటకు రాలేదు. కొంత సమయం వరకు అతడు కనిపించకపోవడంతో స్నేహితులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. అప్పుడు సంపత్ స్విమ్మింగ్‌పూల్ అడుగుభాగంలో కనిపించాడు. వాళ్లు యాజమాన్యానికి సమాచారం అందించగా.. స్విమ్మింగ్‌పూల్ ట్రైనీలు రంగంలోకి దిగి అతడ్ని పూల్ నుంచి బయటకు తీశారు. కానీ, అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు.. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement