తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరుపై పార్టీ ముఖ్య నేతల వద్ద జగ్గారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి జహీరాబాద్ వస్తున్నట్లు తనకు సమాచారం లేదని జగ్గారెడ్డి అన్నారు. జహీరాబాద్ వస్తున్నట్లు కనీసం గీతారెడ్డికి కూడా సమాచారం లేదని, వ్యక్తిగత ప్రచారానికే ఆరాటపడితే పార్టీలో కుదరదని ఆయన ఆరోపించారు. రేవంత్ సంగారెడ్డి జిల్లాకు వస్తున్నట్లు తనకు సమాచారం లేదని, విభేదాలు ఉన్నాయని చెప్పేందుకు సమాచారం ఇవ్వట్లేదా? అని ఆయన నిలదీశారు.
పార్టీలో సింగిల్ హీరోగా ఉండాలనుకుంటే కుదరదని జగ్గారెడ్డి హితవు పలికారు. ఒక్కరి ఇమేజ్ కోసం మిగతా వారిని తొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇది పార్టీనా లేక ప్రైవేటు లిమిటెడ్ కంపెనీనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో చర్చించకుండానే కార్యక్రమాలు ఖరారు చేసుకోవడం ఏంటని నిలదీశారు. ముందే ప్రోగ్రాంలు ఫిక్స్ చేయడమేంటని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కాగా, రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాకముందే తాను మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యానని జగ్గారెడ్డి అన్నారు.