Thursday, April 25, 2024

తెలంగాణలో నాలుగు జిల్లాలకు వెటర్నరీ కాలేజీలు: సీఎం కేసీఆర్

తెలంగాణలోని నాలుగు జిల్లాలకు వెటర్నరీ కళాశాలలు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. సిద్దిపేట, వరంగల్‌, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆదివారం సిద్ధిపేట జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్‌ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కళాశాలల మంజూరు ప్రకటన చేశారు.

రైతులకు మంచి జరుగుతుంటే కొందరు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఎవరేమనుకున్నా తాము పట్టించుకోవడంలేదని, తమ పని తాము చేసుకపోతున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ రాకముందే మిషన్ కాకతీయ రూపకల్పన చేశామని వెల్లడించారు. తమది రైతు కేంద్రంగా పనిచేసే ప్రభుత్వమని ఉద్ఘాటించారు. అవినీతిని అరికట్టేందుకు నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని, అన్నీ ఆలోచించే రైతుబంధు తీసుకొచ్చామని అన్నారు. రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో ముందున్న పంజాబ్ ను కూడా అధిగమించాని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. వాక్ శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధితోనే ఇదంతా సాధ్యమైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ వస్తోందని, ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే తోలు తీయాలని అధికారులకు నిర్దేశించారు. ఎంతటివారైనా ఉపేక్షించవద్దని ఆదేశించారు.

ధరణి పోర్టల్ గురించి చెబుతూ.. రాష్ట్రంలో భూఅక్రమాలకు ఇది అడ్డుకట్ట వేస్తుందని అన్నారు. ఒక్కసారి ధరణి పోర్టల్ లో భూమి వివరాలు నమోదైతే, ఆ భూమి సొంతదారు ఇక నిశ్చింతగా ఉండొచ్చని పేర్కొన్నారు. వీఆర్‌వో నుంచి చీఫ్ మినిస్టర్ వరకు ఎవ్వరూ ఆ వివరాలను మార్చే వీల్లేదని స్పష్టం చేశారు. రెవెన్యూ విభాగంలో 37 చట్టాలున్నాయని, ఎలాంటి లొసుగులకు తావులేని విధంగా ధరణి పోర్టల్ ను పకడ్బందీగా రూపొందించేందుకు మూడేళ్లు శ్రమించామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement