Friday, April 19, 2024

తీరనున్న చెన్నూరు నీటికష్టాలు.. మూడుఎత్తిపోతల పథకాలకు నిధుల కేటాయింపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: లక్షల సంవత్సరాల చరిత్ర, పురాణ హితిహాసాల్లో ప్రస్తావించిన ప్రాణహిత, పవిత్ర గోదావరి తలాపున ప్రవహిస్తున్నా గుక్కెడు మంచినీళ్లకు నోచుకోని చెన్నూరును సస్యశ్యామలం చేసేందుకు భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం నిధులకొరతను తీర్చింది. తెలంగాణ జీవరేఖగా వ్యవహరించే ప్రాణహిత దక్షిణ గంగగా ప్రసిద్ధి చెందిందింది. అయితే దశాబ్దాలపాటు పాలకుల నిర్లక్ష్యంతో తల్లడిల్లిన చెన్నూరు జలకళతో ఊపిరిపీల్చుకోనుంది. గత పాలకులు పూర్వ అదిలాబాద్‌ జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గానికి సాగు,తాగునీరు అందించేందుకు తలపెట్టిన ప్రాజెక్టులు వివాదాల ముసురులో తరాలపాటు తల్లడిల్లి ప్రయోజనం లేకుండా పోయాయి. తెలంగాణ ఆవిర్భావం అనంతరం రీఇంజనీరింగ్‌ డిజన్లు రూపొందించి జిల్లా నీటి అవసరాలను తీర్చెందుకు పర్యావరణ, వన్య, తదితర అనుమతులు సాధించి ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వార నీరు అందించేందుకు పనులు ప్రారంభించింది.

కాళేశ్వరం బ్యాక్‌ వాటర్‌ మంచిర్యాల జిల్లా తూర్పు,దక్షిణ ప్రాంతాలకు ఇదివరకు ప్రతిపాదనలో వర్తింపు కాని ఎగువభములకు సాగునీటిని అందించడానికి కాళేశ్వరం బ్యాక్‌ వాటర్‌ ను వినియోగించాలని ప్రతిపాదించారు. చెన్నూరు అసెంబ్లి నియోజక వర్గంలో మధ్యతరహా, చిన్నతరహా ప్రాజెక్టుల కింద మొత్తం 90వేల ఎకరాలతో పాటు 74, 270 ఎకరాల నూతన ఆయకట్టుకు సాగునీరు అందించడానికి, 15, 730 ఎకరాలను స్థిరీకరించడానికి నీటిపారుదల శాఖ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.

జైపూర్‌, బీమారం, మందమర్రి మండలాల్లోని దాదాపు 25,422ఎకరాలకు సాగునీరు , 5,005 స్థిరీకరణ జరగనుంది. జైపూర్‌ మండలం, షేట్‌ పల్లి గ్రామ సమీపాన గోదావరి నదీపార్వతీ (సుందిళ్ల) బ్యారేజి తీరంలో ఈఎత్తిపోతల పథకం నిర్మాణపనులు ప్రారంభం అయ్యాయి. చెన్నూరు,కోటపల్లి మండలాలలో దాదాపు 480,208ఎకరాలకు సాగునీరు 39,413 నూతన ఎకరాల స్తీరీకరణ జరగనుంది. ఈ ప్రాజెక్టు చెన్నూరు మండలం నరసక్కపేట్‌ గ్రామం సమీపాన గోదావరి నదీపై సరస్వతీ (అన్నారం) బ్యారేజీ తీరంనుంచి నీటిని తోడుతారు. కోటపల్లి మండలంలో దాదాపు 16,371ఎకరాలకు నీరు, 1930ఎకరాల స్థిరీకరణ, మంచిర్యాల చెన్నూరు నియోజకవర్గంలో సుమారు 90వేల ఎకరాలకునీరు, 15,370 స్థిరీకరణ జరగనుంది.

సాగునీటిని కోటపల్లి మండలం వెంచపల్లి గ్రామం సమీపాన ప్రాణహితనదీ పై లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజ్‌ తీరం నుంచి ఎత్తిపోసేందుకు పనులు వేగం పుంజుకుంటున్నయి. రూ.6.88 కోట్లతో సర్వేనిర్వహించింది. టెండర్లను ఆహ్వానించి పనులు ప్రారంభించింది. పనుల్లో వేగంపెంచి త్వరితగతిన పూర్తి చేయాలని రూ.1658 కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించారు. ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే చెన్నూరునియోజకవర్గంలోని 101గ్రామాలకు సాగు,తాగునీరు అందనుంది. మందమర్రి తదితర బొగ్గుగనీ ప్రాంతాల్లోని పట్టణాలకు కూడా నీరు అందించేందుకు పనులు వేగం పుంజుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement