Thursday, April 25, 2024

Challenge – దమ్ముంటే అన్ని స్థానాల‌కు పోటీ చేయ్ – ఎంఐఎంకి బండి స‌వాల్

క‌రీంన‌గ‌ర్ – ‘‘దారుస్సలాంలో కూర్చొని బీరాలు పలకడం కాదు… నిజంగా మీకు దమ్ముంటే, మొగోళ్లయితే తెలంగాణ అంతటా పోటీ చేయాలి. బీఆర్ఎస్ ను సంకలేసుకుని వస్తారో… కాంగ్రెస్ సహా గుంట నక్కల పార్టీలతో కలిసి పోటీ చేస్తారో చూద్దాం.. బీజేపీ సింహం. సింగిల్ గానే పోటీ చేస్తుంది. మీకు డిపాజిట్లు రాకుండా చేస్తాం’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎంఐఎం నేతలకు సవాల్ విసిరారు. సొంతంగా బలపడకుండా ఇంకో పార్టీ బలపడాలని కోరుకునే ఎంఐఎం నాయకులు అధికారంలో ఉన్న పార్టీతో అంటకాగుతూ సొంత ఆస్తులను కాపాడుకోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ముస్లిం సమాజమే ఎంఐఎం పార్టీని చీత్కరిస్తోందన్నారు.

కరీంనగర్ లోని పద్మానగర్ లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి సంబంధించి ఈరోజు నిర్వహించిన భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన బండి సంజయ్ ఈ సందర్భంగా వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… “బీజేపీ నాగుపాము, ఎంఐఎం ఉన్నన్ని రోజులు బీజేపీని అధికారంలోకి రానీవ్వబోమంటూ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై … బీఆర్ఎస్ చేతగాని పార్టీ. ఆ పార్టీ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని అర్ధమవుతోంది. ఎంఐఎంకు అధికారంలోకి రావాలనే ఆలోచన లేదు.. పైసలు సంపుకోవాలని చూస్తోంది. అధికారంలో ఎవరుంటే వాళ్లతో అంటకాగే పార్టీ. ముస్లింల బాగోగుల గురించి ఏనాడూ పట్టించుకోని పార్టీ. నిజంగా ముస్లింలపై ప్రేమ ఉంటే పాతబస్తీ ఎందుకు అభివ్రుద్ధి కావడం లేదు? ముస్లింలకు ఉద్యోగాలు ఎందుకు రావడం లేదు? కనీసం ముస్లింలకు పాస్ పోర్ట్ కూడా ఎందుకు రావడం లేదు? దీనిపై ఎంఐఎం నాయకులు సమాధానం చెప్పాలి. ఒవైసీ ఎంతసేపు ఆస్తులను కాపాడుకోవడానికే తపిస్తున్నారు?” అంటూ ఆరోప‌ణ‌లు గుప్పించారు..

“బీఆర్ఎస్ పై ఎంఐఎంకు ఎంతకంత శ్రద్ధ? అసలు ఆ పార్టీకి అంతటా పోటీ చేసే దమ్ముందా? దారుస్సలాంలో కూర్చొని బీరాలు పలికితే పట్టించుకోనేదెవరు? నిజంగా ఎంఐఎంకు దమ్ముంటే మొగోళ్లయితే తెలంగాణ అంతటా పోటీ చేయాలి. డిపాజిట్లు రాకుండా చేస్తాం. కర్నాటకలో అంతా ఒక్కటయ్యారట… ఇక్కడ కూడా గుంట నక్కల పార్టీలన్నీ ఒక్కటవుతాం. ఎంఐఎంను ముస్లింలు చీత్కరిస్తున్నారు. ఆ పార్టీని నమ్మడం లేదు. 15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరికి చంపుతానన్న నీ తమ్ముడి వ్యాఖ్యలకు జవాబు చెప్పు… నీ ఆసుపత్రిలో పనిచేసే వ్యక్తే ఉగ్రవాదుల నాయకుడు. వాళ్లకు షెల్టర్ ఇస్తూ ఆర్దిక సాయం ఇచ్చే పార్టీ నీది. టెర్రరిస్టులకు బెయిల్ ఇవ్వాలని వాదించిన పార్టీ నీది. సొంతంగా బలపడకుండా ఇంకో పార్టీ బలపడాలని కోరుకునే పార్టీ మీది. ఏనాడైనా సొంతంగా పోటీ చేసి అధికారంలోకి రావాలని కోరుకుందా? మీరు నిజంగా ముస్లిం సమాజం కోసమే పనిచేస్తున్నారని భావిస్తే…తెలంగాణ వ్యాప్తంగా పోటీ చేయాలి. టీఆర్ఎస్ ను సంకలో వేసుకుని వస్తావా? ఇతర పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకుని వస్తారా?..రండి…. బీజేపీ సింహం లెక్క సింగిల్ గా పోటీ చేస్తది” అంటూ తేల్చి చెప్పారు.

శంషాబాద్ లోని ఓ వ్యాపారి అమిత్ షా కు ఇల్లు కట్టించారని, అమిత్ షా ఇకపై ఇక్కడే ఉంటారని ఎంఐఎం చేసిన ఆరోపణలను కొట్టిపారేసిన బండి సంజయ్ ‘‘ ఆ విషయం ఆయనకే తెలవాలి. బహుశా ఆయనకు టెర్రరిస్టు సంస్థ ఏమైనా ఈ విషయం చెప్పిందేమో… ఆ ఇంటికి వస్తే పేల్చాలని చూస్తున్నరేమో… మా పార్టీ అగ్రనేత సమాచారం మాకు తెలియకుండానే ఆయనకే తెలుస్తుందా?’’అంటూ ఎద్దేవా చేశారు
కాగా, “ఏడుకొండల వెంకటేశ్వరస్వామి భక్తుల కొంగు బంగారం. కోరిన కోర్కెలు తీర్చే దేవదేవుడు వెంకటేశ్వరస్వామి. విదేశీ భక్తులెందరో వస్తున్నారు. అట్లాంటి స్వామిని ప్రజల వద్దకు తీసుకురావాలనే మంచి ఉద్దేశంతో టీటీడీ కరీంనగర్ లో ఆలయం నిర్మించడం చాలా సంతోషం. ఇందులో పాల్గొనడం పూర్వ జన్మ సుక్రుతం. హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడంలో, ధార్మిక కార్యక్రమాల అమలు కోసం టీటీడీ ఎంతగానో క్రుషి చేస్తోంది. అందులో భాగంగా రూ.20 కోట్లతో శ్రీవారి ఆలయాన్ని నిర్మించడం సంతోషం. ఇది జిల్లా ప్రజల అద్రుష్టం. ఈ ప్రాంత ప్రజల కోరికలు తీర్చే, కష్టాలను తొలగించే శక్తివంతమైన దేవాలయంగా ప్రసిద్దిగాంచాలని వెంకటేశ్వరస్వామిని కోరుకుంటున్నా. కరీంనగర్ ఎంపీ టీటీడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా” అని అన్నారు..
ప్రజా సంగ్రామ యాత్రపై మీడియా అడిగిన ప్రశ్నకు ‘‘బస్ యాత్ర, పాదయాత్రపై పార్టీలో అందరం కూర్చుని నిర్ణయం తీసుకుంటామే తప్ప ఏక్ నిరంజన్ పార్టీ కాదు’’అని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement