Thursday, April 25, 2024

తెలంగాణకు 8 జాతీయ పంచాయతీరాజ్ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ పల్లెలకు కేంద్ర గుర్తింపు దక్కింది. జాతీయ పంచాయతీరాజ్ అవార్డుల్లో రాష్ట్రానికి పలు పురస్కారాలు దక్కాయి. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాల్లో అగ్రస్థానంలో నిలిచింది. 9 విభాగాల్లో కేంద్ర ప్రభుత్వం 27 అవార్డులను ప్రకటించగా 8 పురస్కారాలు తెలంగాణ పంచాయతీలను వరించాయి. 4 విభాగాల్లో రాష్ట్ర పంచాయతీలు మొదటి స్థానంలో నిలిచాయి. ఆరోగ్య పంచాయతీ విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గౌతమ్‌పూర్ ఫస్ట్ ప్లేస్‌ దక్కించుకుంది.

తగినంత నీరు కలిగిన పంచాయతీ కేటగిరీలో నెల్లుట్ల (జనగామ జిల్లా) తొలిస్థానం నిలవగా, సామాజిక భద్రత పంచాయతీ విభాగంలో కొంగట్‌పల్లి (మహబూబ్ నగర్ జిల్లా)కు తొలి స్థానం లభించింది. మహిళా స్నేహపూర్వక పంచాయతీ కేటగిరీలో ఐపూర్(సూర్యాపేట) అగ్రస్థానం దక్కించుకుంది. మెరుగైన జీవనోపాధి పంచాయతీ విభాగంలో మాన్‌దొడ్డి( గద్వాల జిల్లా)కి రెండో స్థానం, గుడ్ గవర్నెన్స్ కేటగిరీలో చీమల్ దర్రి(వికారాబాద్ జిల్లా)కి రెండో స్థానం, పచ్చదనం-పరిశుభ్రత పంచాయతీ విభాగంలో సుల్తాన్‌పూర్ ( పెద్దపల్లి జిల్లా)కి 3వ స్థానం లభించింది. స్వ‌యం స‌మృద్ధి మౌలిక స‌దుపాయాల విభాగంలో రాజ‌న్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట‌కు మూడోస్థానం దక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement