Friday, April 19, 2024

ఏపీ కేడర్‌ అధికారుల కేసు 27కు వాయిదా..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల కేటాయింపుల కేసు విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ 12 మంది బ్యూరోక్రాట్ల క్యాడర్‌పై వేసిన పిటిషన్‌ను శుక్రవారం విచారించింది. కేంద్ర ప్రభుత్వోద్యోగుల ట్రిబ్యునల్‌(క్యాట్‌) వేర్వేరుగా తీర్పులు వెలువరించిందని ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ అభిప్రాయపడ్డారు. అన్ని పిటిషన్లపై రెగ్యులర్‌ బెంచ్‌ విచారణ జరుపుతుందని తెలిపారు. ఈ సందర్భంగా వ్యక్తిగత వాదనలు వినిపిస్తామని అధికారుల తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. దీంతో తదుపరి విచారణను ఈనెల 27కు హైకోర్టు వాయిదా వేసింది.

ఏపీ క్యాడర్‌కు చెందిన 12 మంది ఆలిండియా సర్వీస్‌ అధికారులు క్యాట్‌ మధ్యంతర ఉత్తర్వులతో గడిచిన ఎనిమిదేళ్ళ కాలంగా తెలంగాణలో పనిచేస్తున్నారు. వీరిలో తెలంగాణ ఇన్‌చార్జ్‌ డీజీపీ అంజనీకుమార్‌, ఎడ్యుకేషన్‌ సెక్రటరీ వాకాటి కరుణ, ఫైనాన్స్‌ స్పెషల్‌ సెక్రటరీ రొనాల్డ్‌ రాస్‌ తదితరులు ఉన్నారు. ఆంద్రప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన సోమేశ్‌ కుమార్‌ మొన్నటిదాకా తెలంగాణ సీఎస్‌గా పని చేశారు. అయితే, క్యాడర్‌ విషయంలో వారం కిందట హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడం, అందుకు అనుగుణంగా డీవోపీటీ ఆదేశాలు జారీ చేయడంతో తెలంగాణలో సీఎస్‌ పోస్టును వదులుకోవాల్సి వచ్చింది. ఉత్తర్వులు వెలువడిన రెండు రోజుల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్‌లో సోమేశ్‌ కుమార్‌ రిపోర్ట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement