Wednesday, April 17, 2024

టైమ్ మ్యాగజైన్ టాప్-100 కంపెనీలలో జియో, బైజూస్

భారత్‌కు చెందిన రెండు కంపెనీలు 2021 ఏడాదికి టైమ్ మ్యాగజైన్ టాప్-100 కంపెనీల జాబితాలో చోటు సంపాదించాయి. దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) అనుబంధ టెలికాం సంస్థ జియో, ఈ-లెర్నింగ్ స్టార్టప్ కంపెనీ బైజూస్ కంపెనీలు టైమ్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ కంపెనీల జాబితాల్లో చేరాయి. ఈ జాబితా కోసం హెల్త్‌కేర్, ఎంటర్‌టైన్‌మెంట్, టెక్నాలజీ సహా ఇంతర రంగాలకు చెందిన సంస్థలున్నాయి. ప్రభావం, ఇన్నోవేషన్, లీడర్‌షిప్, బలమైన కాంక్ష, విజయాంతం వంటి కీలక అంశాలను పరిశీలించిన తర్వాత ఈ జాబితాను తయారుచేసినట్టు టైమ్ మేగజైన్ తెలిపింది. టైమ్ మేగజైన్ భారత్‌లో ‘లీడింగ్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్మేషన్’ జాబితాలో రిలయన్స్ జియోను చేర్చినట్టు పేర్కొంది.

భారత్‌లో కొన్నేళ్లుగా జియో అతి తక్కువ డేటా రేట్ల(1జీబీకి రూ. 5 కన్నా తక్కువ)ను వసూలు వేయడం ద్వారా అతిపెద్ద 4జీ నెట్‌వర్క్‌ను నిర్మించినట్టు మ్యాగజైన్ వివరించింది. 41 కోట్ల చందాదారులను కలిగిన జియో ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారని మేగజైన్ తెలిపింది. వాట్సాప్ ద్వారా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధికి ఫేస్‌బుక్‌తో పనిచేస్తోందని, తక్కువ ఖర్చుతో 5జీ స్మార్ట్‌ఫోన్‌ల కోసం గూగుల్‌తో భాగస్వామ్యం కలిగి ఉన్నట్టు మ్యాగజైన్ వెల్లడించింది. మరోవైపు భారత్‌లో ఈ-లెర్నింగ్ విస్తరణకు ప్రముఖ స్టార్టప్ ‘బైజూస్’ ఎంతో తోడ్పడిందని టైమ్ తన నివేదికలో పేర్కొంది. కరోనా మహమ్మారి కారణంగా ఆన్‌లైన్ లెర్నింగ్‌కు డిమాండ్ రికార్డు స్థాయిలో పెరగడంతో బైజూస్ ఈ విభాగంలో వేగంగా అభివృద్ధి చెందింది. కరోనా వ్యాప్తి సమయంలో బైజూస్ దాదాపు 8 కోట్లతో రెట్టింపు వినియోగదారులను సాధించింది. అలాగే, టెన్సెంట్, బ్లాక్‌రక్ లాంటి ఇన్వెస్టర్ల నుంచి నిధులను అందుకున్నట్టు టైమ్ మ్యాగజైన్ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement