Thursday, April 25, 2024

కృష్ణా జిల్లాలో పెంపుడు కుక్కకు కాంస్య విగ్రహం

ఇప్పటి సమాజంలో మనుషుల కంటే జంతువులనే ప్రజలు ఎక్కువగా నమ్ముతున్నారు. జంతువులపై మనం ఎంత ప్రేమ చూపిస్తే అవి మనకు అంత విశ్వాసంగా పనిచేస్తాయని నమ్మకం. అందుకే చాలా చోట్ల పెంపుడు జంతువుల చనిపోతే వర్థంతి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ఓ వ్యక్తి తాను పెంచుకున్న కుక్కపై ఎంత మమకారం చూపాడో ప్రతి ఒక్కరూ తెలుసుకుని తీరాల్సిందే.

గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం అంపాపురంకు చెందిన సుంకర జ్ఞాన ప్రకాశరావు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉండగా వారికి వివాహం చేసి అత్తారింటికి పంపాడు. కూతుళ్లు కాపురానికి వెళ్లిపోవడంతో ఒంటరిగా ఉన్న జ్ఞానప్రకాశరావు దంపతులకు ఓ కుక్క పిల్ల దొరికింది. దీంతో దానిని అల్లారు ముద్దుగా సాకారు. కుక్క కూడా సదరు దంపతులను సొంతవారిలా భావించేది. జ్ఞానప్రకాశరావు బయటకు వెళ్తే తిరిగి వచ్చేవరకు ఆహారం ముట్టేది కాదు. ఇంట్లో ఎవరికైనా జ్వరం వస్తే ఆ జ్వరం తగ్గేవరకు ఏం తినేది కాదు. ఆ దంపతులకు కావాల్సిన వస్తువులను నోటితో పట్టుకుని వచ్చేది. దీంతో ఆ మూగ జంతువు చుట్టుపక్కల వారిని కూడా ఆశ్చర్యపరిచేది.

అయితే 5 ఏళ్ల కిందట సదరు కుక్క చనిపోయింది. సాటి మనిషి చనిపోతే పట్టించుకోని ఈ రోజుల్లో ఆ కుక్కకు కాంస్య విగ్రహం కట్టించి జ్ఞానప్రకాశరావు శాస్త్రోక్తంగా పూజాధికాలు నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి బంధువులను, గ్రామస్తులను ఆహ్వానించి అల్పాహార విందు ఏర్పాటు చేశాడు. ఈ తతంగంతో ఆయనకు తన పెంపుడు జంతువు అంటే ఎంత ప్రేమో అందరికీ తెలిసింది.

ఈ వార్త కూడా చదవండి: వాడి పడేసిన ఫేస్ మాస్కులతో గౌన్ కుట్టించుకున్న యువతి

Advertisement

తాజా వార్తలు

Advertisement