Wednesday, April 24, 2024

ఏడు నెలల్లో 77,200 టికెట్ల బుకింగ్‌.. టీఎస్‌ ఆర్టీసీ బాలాజీ దర్శన్‌కు విశేష స్పందన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టీఎస్‌ ఆర్టీసీ బాలాజీ దర్శన్‌ టికెట్లకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన కేవలం 7 నెలల్లోనే 77 వేలకు పైగా టికెట్ల బుకింగ్‌ కావడం విశేషం. గత ఏడాది జులైలో టీఎస్‌ ఆర్టీసీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టగా ఆ నెలలో 3,109, ఆగస్టులో 12,092, సెప్టెంబర్‌లో 11,586, అక్టోబర్‌లో 14,737 , నవంబర్‌లో 14,602, డిసెంబర్‌లో 6,890 మంది ప్రయాణికులు బాలాజీ దర్శన్‌ టికెట్లను బుకింగ్‌ చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో 14,182 మంది బస్‌ టికెట్‌తో పాటు శ్రీవారి శీఘ్ర దర్శన టికెట్లను బుక్‌ చేసుకున్నారు. తెలంగాణ నుంచి తిరుమల వెళ్లే భక్తుల కోసం గత ఏడాది జులై నుంచి బాలాజీ దర్శన్‌ను టీఎస్‌ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమల వెళ్లేందుకు బస్‌ టికెట్‌ బుక్‌ చేసుకునే సమయంలోనే శ్రీవారి శీఘ్ర దర్శన టికెట్‌ను బుక్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.

అందుకోసం టీటీడీతో టీఎస్‌ ఆర్టీసీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. బాలాజీ దర్శన్‌ టికెట్లకు భక్తుల నుంచి అనూహ్య స్పందన వస్తున్న నేపథ్యంలో ఈ టికెట్‌తో ఎ లాంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా ప్రయాణించి వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని టీఎస్‌ ఆర్టీసీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. బాలాలయ మహా సంప్రోక్షణను టీటీడీ వాయిదా వేసినందున ఈనెల 23 నుంచి మార్చి 1 వరకు బ్లాక్‌ చేసి ఉన్న శీఘ్ర దర్శన టికెట్లను తిరిగి విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా టీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండి విసి సజ్జన్నార్‌ మాట్లాడుతూ బాలాజీ దర్శన్‌ టికెట్లను కనీసం వారం రోజుల ముందుగా బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుందని వారు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement