Friday, April 26, 2024

ఎంపీ నవనీత్‌కౌర్ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు

ప్రముఖ నటి, మహారాష్ట్ర స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్‌కు బాంబే హైకోర్టు రూ.2 లక్షలు జరిమానా విధించింది. ఆమె తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించినందుకు ఈ చర్య తీసుకుంది. ఆమె విదర్భలోని అమరావతి నుంచి ఎన్నికైన పార్లమెంటు సభ్యురాలు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆమె తన పదవిని కోల్పోయే అవకాశం ఉంది. అయితే ఆమె పదవి గురించి హైకోర్టు మౌనంగా ఉంది. నవనీత్‌కౌర్ ఎస్సీ కాదని, ఫోర్జరీ సర్టిఫికెట్‌తో పోటీచేశారని ఆరోపిస్తూ శివసేన నేత, మాజీ ఎంపీ ఆనందరావు అదసూల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బాంబే హైకోర్టు విచారణ చేపట్టి.. మంగళవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది.

మహారాష్ట్రలోని అమరావతి ఎస్సీ రిజర్వ్ లోక్‌సభ స్థానం నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల్లో నవనీత్ కౌర్ విజయం సాధించారు. బాంబే హైకోర్టు తీర్పుతో ఆమె పార్లమెంట్ సభ్యత్వానికి ముప్పు ఏర్పడింది. నవనీత్ కౌర్ ఆరు నెలల్లోగా తన సర్టిఫికెట్లు కోర్టు ముందుంచాలని ఆదేశించింది.2014 సార్వత్రిక ఎన్నికల ముందు రాజకీయాల్లోకి వచ్చిన నవనీత్ కౌర్.. అప్పట్లో ఎన్సీపీ టిక్కెట్‌పై పోటీచేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. నవనీత్ భర్త రవి రాణా ప్రస్తుతం అమరావతి జిల్లా బద్నేరా ఎమ్మెల్యేగా ఉన్నారు.

కాగా పార్లమెంట్ లాబీల్లోనే శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తనపై బెదిరింపులకు పాల్పడ్డారని ఇటీవల నవనీత్ ఆరోపించిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతామని సావంత్ వార్నింగ్ ఇచ్చినట్టు నవనీత్ చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని ఆమె లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ ద్వారా తెలియజేశారు. యాసిడ్ దాడి చేస్తామంటూ తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, శివసేన లేటర్ హెడ్స్‌తో లేఖలు వస్తున్నాయని అని కూడా పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement