Thursday, March 28, 2024

బ్లాక్ ఫంగస్ చికిత్సకు రూ.1.5 కోట్లు ఖర్చు

దేశవ్యాప్తంగా కరోనా చికిత్స కోసం రూ.లక్షలు ఖర్చు పెడుతున్న వారిని చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ చికిత్సకూ అంతకన్నా ఎక్కువే పెట్టాల్సి వస్తోంది. ఇందుకు నిదర్శనం బ్లాక్ ఫంగస్ బారిన పడిన మహారాష్ట్రలోని విదర్భకు చెందిన నవీన్ పాల్ (46) అనే వ్యక్తి రూ.కోటిన్నర ఖర్చు పెట్టడమే. గత అక్టోబర్ లోనే తనలోని బ్లాక్ ఫంగస్ లక్షణాలను వైద్యులకు నవీన్ చెప్పారు. కానీ అప్పటికి అదే తొలి కేసు కావడం, దాని చికిత్స పద్ధతులు తెలియకపోవడంతో అతడు తన ఎడమ కంటిని కోల్పోవాల్సి వచ్చింది. దాదాపు ఆరు ఆసుపత్రుల్లో 13 శస్త్రచికిత్సల తర్వాత అతడు కోలుకున్నాడు.

అతడి భార్య రైల్వే ఉద్యోగి కావడంతో చికిత్సకు అయిన ఖర్చుల్లో కోటి రూపాయలను రైల్వే శాఖ భరించింది. మిగతా రూ.48 లక్షలను అతడు సమీకరించుకున్నాడు. తన ప్రాణం దక్కుతుందంటే కన్ను పోయినా ఫర్వాలేదని డాక్టర్లకు చెప్పినట్టు నవీన్ తెలిపాడు. గత ఏడాది సెప్టెంబరులో తనకు కరోనా సోకిందని, కొన్ని రోజులకు తగ్గిపోవడంతో ఇంటికొచ్చేశానని తెలిపాడు. అయితే, ఆ తర్వాత కొన్నాళ్లకే పన్ను, కన్ను బాగా ఎఫెక్ట్ అయ్యాయని చెప్పాడు. నగరంలోని ఓ ఆసుపత్రిలో చేరానని, అక్కడి నుంచి హైదరాబాద్‌కూ వెళ్లానని వివరించాడు. అక్కడి నుంచి నాగపూర్‌కు పంపించారన్నారు. నాగపూర్ నుంచి ముంబైలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నానని చెప్పాడు. అక్కడ కొన్నిరోజులకే రూ.20 లక్షల బిల్లు వేయడం.. చేతుల్లోని డబ్బులు అయిపోవస్తుండడంతో మళ్లీ నాగపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరానన్నాడు. అక్కడే తన కంటిని తీసేశారని, కన్ను పోయినా ప్రాణం దక్కినందుకు సంతోషంగానే ఉందన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement