Thursday, March 28, 2024

Big story : డబుల్‌ బెడ్‌ రూమ్ ఇళ్ల‌ నిర్మాణం చకాచకా.. రూ.18 వేల కోట్ల వ్యయంతో 2.91 లక్షల ఇళ్ల‌ నిర్మాణం.

ఆంధ్రప్రభ, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ మానసపుత్రికగా ఆవిర్భవించిన నిరుపేదలకు సొంతింటి కల సాకారం దిశగా సర్కార్‌ వేగం పెంచింది. నిరుపేదల జీవితాల్లో సామాజిక హోదాను పెంచే లక్ష్యంతో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం వీలైనంత తొందర్లో ఆయా ఇండ్ల పంపిణీకి చర్యలు వేగిరం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు రెండు పడకల ఇళ్ల నిర్మాణం పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని తాజాగా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు రెండు పడకల ఇళ్ల నిర్మాణాలు చేపట్టి ఉచితంగా యాజమాన్య హక్కులను అందించే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే.

2.91లక్షల ఇండ్లు…రూ. 18వేల కోట్లు…

రాష్ట్రంలో 2.91 లక్షల డబుల్‌ ఇండ్ల నిర్మాణం చేపట్టేందుకు రూ.18 వేల కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. మున్సిపాలిటీలు, గ్రామాలలో ఇప్పటికే సదరు నిర్దేశిత ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరుకున్నాయి. వాటికి మౌళిక సదుపాయాల కల్పనలో భాగంగా రహదారులు, విద్యుత్‌, మంచినీరు, డ్రైనేజీ వంటి సౌకర్యాలు పూర్తి చేసిన ప్రభుత్వం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. 2023 జనవరి 15లోపు పెండింగ్‌ స్వల్ప పనులను పూర్తి చేయించి మౌళిక వసతులు కల్పించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించింది. ఇండ్లను లబ్దిదారులకు అప్పగించే విధంగా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

- Advertisement -

అర్హతలివే…

లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, దారిద్య్ర రేఖకు దిగువన ఉండి తెల్ల రేషన్‌ కార్డు కలిగి ఉండాలని సూచించింది. అద్దె భవనాల్లో నివసిస్తున్న వారు అర్హులని ప్రభుత్వం మార్గదర్శకాల్లో తెలిపింది. ముందుగా గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించాలని, వచ్చిన దరఖాస్తులను సంబంధిత తహిశీల్దార్లకు పంపించాలని, క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను కలెక్టర్లకు పంపించాలని తాజా ఆదేశాల్లో పేర్కొంది. అనంతరం జాబితాను కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి పంపిస్తే క్షుణ్ణంగా పరిశీలించి తుది జాబితా ఖరారు చేయనున్నారు. నిర్మించిన ఇళ్ల కంటే అర్హులైన లబ్ధిదారులు ఎక్కువ ఉంటే లక్కీ డీప్‌ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని, మిగిలిన దరఖాస్తుదారుల జాబితాను వెయిటింగ్‌ లిస్ట్‌లో పెట్టాలని అధికారులు భావిస్తున్నారు.

జనవరి 15లోగా అందజేసేందుకు చర్యలు…

ఆయా జిల్లాలలో లక్ష్యంగా పెట్టుకున్న రెండుపడకల ఇళ్ల నిర్మాణ పనుల్లో ఇప్పటికే టెండర్‌ పూర్తి అయి నిర్మాణ దశలో ఉన్న వాటిని జనవరి 15లోగా పూర్తి చేసేందుకు ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. నిర్మాణం చివరి దశలో ఉన్నవాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మౌళిక సదుపాయాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు వారం వారం సమీక్ష నిర్వహించి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడంతోపాటు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని సూచించారు.

సీఎం కేసీఆర్‌ లక్ష్యం…పేదల పక్షం…

పగలు పనికి పోయినా రాత్రి మనది అనే ఓ చిన్న గూడు ఉంటే చాలు అనుకునే నిరుపేద కుటుంబాలకు కోటి వెలుగులు పంచుతూ… 560 చదరపు అడుగుల వైశాల్యంలో విశాలమైన రెండు పడక గదులు, ఒక వంట గది, ఒక హాల్‌ తో పాటు రెండు బాత్‌ రూంలతో, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళని ప్రభుత్వం ఉత్తమ ప్రమాణాలతో నిర్మిస్తోంది. ఇళ్ళు లేని నిరుపేదల మీద ఒక్క పైసా భారం మోపకుండా ఉచితంగా ఇంటిని అందించే దృఢ సంకల్పంతో చేపట్టిన ఓ బృహత్తర పథకం ఈ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళు. సొంత ఇళ్ళు అనేది ప్రతి ఒక్కరికీ ఓ అందమైన కల, ఎందరో నిరుపేదల సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు నేనున్నానంటూ నిలబడ్డ సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఓ వరం… డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళుగా పలు రాష్ట్రాలు ఈ పథకాన్ని కీర్తించాయి.

2.91 లక్షల ఇండ్ల పూర్తి….

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు పడకల గృహ నిర్మాణ పథకంలో ఇప్పటి వరకు 2,91,057ఇండ్లను మంజూరీ చేసింది. ఇప్పటివరకు మంజూరు చేసిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. కొన్ని చోట్ల లబ్దిదారులకు అందజేసి వారు నివాసాలు కూడా ఉంటున్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళ డిజైన్‌, లే అవుట్‌లలో, సృజనాత్మకత , ఇండ్ల నిర్మాణంలో మెరుగైన పనితీరు కనబర్చినందుకు మరియు పారదర్శకత పాటించుచున్నందుకు ”ఆన్‌లైన్‌ ప్రాజెక్టు మానిటరింగ్‌ సిస్టం’ కు జాతీయ స్థాయిలో ఇటీవల హడ్కో అవార్డులు కూడా ప్రభుత్వం దక్కించుకోవడం జరిగింది.

ఈ ప్రతిష్టాత్మక పథకం అమలును అధ్యయనం చేసేందుకు, తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు అనేక పర్యటనలు జరిగాయి. రాష్ట్రాన్ని సందర్శించిన జాతీయస్థాయి, ఇతర రాష్ట్రాల అధికారులు, నిపుణులు ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల అధికారులు అధ్యయనం నిమిత్తం రాష్ట్రంలో పర్యటించి ఉన్నత ప్రమాణాలతో, నూతన సాంకేతిక పరిజ్ఞానముతో నిర్మిస్తున్న ఇళ్లను పరిశీలించి, ప్రశంసిస్తూ వారి రాష్ట్రాలలో కూడా అమలు చేసేందుకు చర్యలు తీసుకొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement