Thursday, April 25, 2024

బ్యాడ్మింటన్‌ లీగ్‌ వచ్చేస్తోంది.. జిపిబిఎల్‌ సీజన్‌-2కి కసరత్తు

గ్రాండ్‌ ప్రిక్స్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (జిపిబిఎల్‌) రెండవ సీజన్‌కు సన్నాహాలు మొదలయ్యాయి. 25 దేశాలకు చెందిన బ్యాడ్మింటన్‌ ఆటగాళ్లు ఈ మెగా లీగ్‌లో పాలుుపంచుకోనున్నారు. కిందటిసారి 8 జట్లు టైటిల్‌ వేటలో పాల్గొనగా, ఈసారి మరో రెండు జట్లు బరిలోకి దిగబోతున్నాయి. సీజన్‌-2 ప్రక్రియకు సంబంధించిన వివరాలను శనివారం అధికారికంగా వెల్లడించారు. జట్ల వేలం ప్రక్రియ ఈనెల 10 జరగనుండగా, వచ్చేనెల 22న ఆటగాళ్ల కొనుగోలుకు వేలం నిర్వహిస్తారు.

టీమ్‌ వేలంలో బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, కేరళ, ముంబై, పుణ, అహ్మదాబాద్‌, ఢిల్లి, లక్నో, ఒడిశా జట్లు పోటీపడనున్నాయి. ఈ పది జట్లకు ప్రాతినిధ్యం వహించేందుకు దాదాపు 350 మంది భారతీయ ఆటగాళ్లతోపాటు 52 మంది విదేశీ ప్లేయర్లు సిద్ధమవుతున్నారు. మొత్తం 400 మంది ఆటగాళ్లలో 150 మంది వేలం ప్రక్రియకు షార్ట్‌లిస్టు చేయబడతారు. బిడబ్ల్యుఎఫ్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌-50లోపు ర్యాంకులో ఉన్న ప్రస్తుత భారత జూనియర్‌ నంబర్‌ వన్‌ , సీనియర్‌ నేషనల్‌ చాంపియన్‌ మంజునాథ్‌, సాయి ప్రణీత్‌ వేలానికి సైన్‌అప్‌ చేశారు.

ఒక్కోజట్టుకు మొత్తం ప్లేయర్స్‌ పర్స్‌ను రూ.30 లక్షలుగా నిర్ణయించారు. లీగ్‌లో పాల్గొనే జట్లు నాలుగు విభిన్న శ్రేణుల నుంచి ఆటగాళ్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది. వేలంలో విక్రయించబడని ఆటగాళ్లకు రూ.25000 కనీస ధర అందుతుంది. ఆగస్టులో జరిగే జీపీబీఎల్‌ సీజన్‌-2కి బెంగళూరు వేదికవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement