దాదాపు వెయ్యి రోజులకుపైగా టీ-20 ఫార్మాట్ క్రికెట్లో నెంబర్ 1గా ఉన్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ అధిగమించారు. ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ-20 ర్యాంకులలో అగ్రస్థానంలో బాబర్ నిలిచాడు. గడచిన దశాబ్దకాలంలో విరాట్ కోహ్లీ ఈ జాబితాలో ఎక్కువకాలం నెంబర్ 1గా కొనసాగారు. అయితే, కొద్ది నెలలుగా కోహ్లీ ఫార్మ్ కోల్పోవడం, బాబర్ అద్భుత ప్రదర్శన కనబరచడంతో అతడి ర్యాంక్ మెరుగైంది. ఇక భారత క్రీడాకారుల్లో ఇషాన్ కిషన్ రెండు స్థానాలు మెరుగుపరుచుకోగా ఐర్లాండ్తో మంగళవారం జరిగిన టీ-20 మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసిన బ్యాట్స్మన్ దీపక్ హుడా, సంజు శాంసన్ తమ ర్యాంకులలో పైకి ఎగబాకారు.
ఐర్లాండ్తో ఆడిన రెండు టీ-20 మ్యాచ్లలో 47, 104 పరుగులు చేసిన దీపక్ హుడా ఏకంగా 414 స్థానాలు మెరుగుపరుచుకుని 104 ర్యాంక్ సాధించాడు. ఇక కిషన్ 7వ ర్యాంకు పొందగా సంజు శాంసన్ 144వ ర్యాంకు పొందాడు. ఇక బౌలర్ల జాబితాలో పేస్ బౌలర్ హర్షల్ పటేల్ 37వ స్థానం నుంచి 33వ స్థానానికి ఎగబాకగా ఐర్లాండ్ బౌలర్ మార్క్ ఎడైర్ 45వ స్థానం నుంచి 43 స్థానానికి చేరాడు. ఇక టెస్ట్ ర్యాంకుల్లో న్యూజిలాండ్ బ్యాట్స్మన్ డేరియల్ మిషెల్, టామ్ బ్లండెల్ తమ కెరీర్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఐసీసీ టెస్ట్ ర్యాంకుల జాబితాలో ఆ ఇద్దరూ కెరీర్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ టోర్నీలోని మూడో టెస్ట్ మ్యాచ్లో వీరు రాణించారు.
మూడు టెస్టుల సిరీస్లో అన్ని మ్యాచ్లలో వారిద్దరూ సెంచరీ భాగస్వామ్యం సాధించడం విశేషం. నాలుగు స్థానాలు మెరుగుపరుచుకన్న మిషెల్ 12వర్యాంకును, 11 స్థానాలను మెరుగుపరుచుకున్న బ్లండెల్ 20వ ర్యాంకును సాధించారు. ఇక బౌలర్లలో న్యూజిలాండ్కు చెందిన నీల్ వాగ్నర్ ఒక స్థానం దిగజారి పదో ర్యాంక్ సాధించగా, ఇంగ్లాండ్ బౌలర్లు స్టువార్ట్ బ్రాడ్ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని 13వ ర్యాంకును జాక్ లీచ్ 13 స్థానాలు ఎగబాకి 25వ స్థానంలోను నిలిచారు. ఆల్రౌండర్ విభాగంలో బంగ్లాదేశ్ కెప్టెన్ షాకిబ్ అల్ హుస్సేన్ 3వ ర్యాంక్ను, వెస్టిండీస్ బౌలర్ కైలే మేయర్ 8వ స్థానంలోను నిలిచారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హజ్లేవుడ్ టీ-20 ర్యాంకుల్లో అగ్రస్థానంలో ఉండగా ఇప్పుడు వన్డేల్లో ఐదవ ర్యాంక్ను సాధించాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.