Tuesday, March 26, 2024

మహిళా బిల్లుకు మా మద్దతు, కేంద్రాన్ని వ్యతిరేకించడం వల్లే టీఆర్‌ఎస్‌పై దాడులు : సీపీఐ నేత నారాయణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది కాబట్టే ఆ పార్టీపై కేంద్రం దాడులు చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ మోదీకి జై కొడితే రాత్రికి రాత్రే కేసులన్నీ మాయమైపోతాయని ఎద్దేవా చేశారు. తృణమూల్ కాంగ్రెస్‌లో శారద, నారద కేసుల్లో ఉన్నవాళ్లు బీజేపీలో చేరగానే ఏమైందని ఆయన ప్రశ్నించారు. గురువారం నారాయణ న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించే రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు, వ్యక్తులపై కేంద్రం ఏకపక్ష దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఏపీలో వైసీపీ గెలిచిందంటే బీజేపీ గెలిచినట్టే లెక్కని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే వైసీపీ నుంచి ఆ పార్టీకి ఎక్కువ మద్ధతు లభిస్తోందని చెప్పారు. టీడీపీని బలహీనపర్చడం కోసం పవన్ కళ్యాణ్‌ను బీజేపీ తమవైపు లాగుతోందని తెలిపారు. మోదీకి మద్ధతిచ్చే వైసీపీకి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిన అవసరం ఉందని నారాయణ పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ ఎంతవరకు కలిసొస్తారో చూడాలన్నారు.

జీ-20 కి భారత్ నాయకత్వాన్ని సీపీఐ కూడా స్వాగతిస్తోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా బిల్లును ఆమోదించాలని నారాయణ డిమాండ్ చేశారు. మహిళా బిల్లును ఆమోదించకుండా జీ-20లో మహిళా సాధికారతపై ఏం చర్చిస్తారని నిలదీశారు. ఇటీవల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా మహిళా బిల్లు ఆమోదించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మహిళా బిల్లు ఆమోదానికి సీపీఐ పూర్తిగా సహకరిస్తుందని స్పష్టం చేశారు. జీ-20లో పుష్పం గుర్తును లోగోగా పెట్టడం కేంద్రం సంకుచిత స్వభావానికి నిదర్శనమన్న ఆయన, దాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement