Thursday, April 25, 2024

బ్యూటీ పార్లర్ బిజినెస్ పడిపోతుంది.. మాస్క్ పెట్టుకోవద్దని మంత్రి ప్రచారం

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మాస్క్ తప్పకుండా ధరించాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తుంటే.. అసోం ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ మాత్రం మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే అసోంలో కరోనా వైరస్ ప్రభావం అంతగా లేదని, ప్రజలు మాస్క్ ధరిస్తే బ్యూటీపార్లర్లు ఎలా నడుస్తాయని మంత్రి హిమంత బిస్వాశర్మ వ్యాఖ్యానించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.

వివరాల్లోకి వెళ్లే అసోంలో ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు అంతగా నమోదు కావడం లేదని మంత్రి హిమంత బిస్వా శర్మ వెల్లడించారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచే అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు ప్రజలు మాస్కులు ధరిస్తే బ్యూటీపార్లర్ బిజినెస్ ఎలా నడుస్తుందని ప్రశ్నించారు. బ్యూటీపార్లర్ల నిర్వాహకులకు కూడా బిజినెస్ నడవాలని.. ప్రజలు బ్యూటీపార్లర్లకు వెళ్తే మంచి రిలీఫ్‌గా ఉంటుందన్నారు. ఒకవేళ రాష్ట్రంలో కరోనా వైరస్ నుంచి అపాయం ఉందని తెలిస్తే తామే ప్రజలకు మాస్క్ ధరించాలని ఆదేశాలు జారీ చేస్తామని.. అప్పుడు మాస్క్ ధరించకపోతే రూ.500 జరిమానా విధిస్తామని మంత్రి గారు సెలవిచ్చారు.

కాగా ప్రతిపక్ష నేతను బెదిరించిన అంశంలో ఎన్నికల కమిషన్ అసోం మంత్రి హిమంత బిస్వా శర్మపై 48 గంటల పాటు నిషేధాన్ని విధించింది. చివరకు మంత్రి క్షమాపణలు చెప్పడంతో నిషేధాన్ని శనివారం నాడు ఈసీ కుదించి 24 గంటలకు తగ్గించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement