Wednesday, April 24, 2024

ఆక్వా పరిశ్రమ బాగా దెబ్బతింది, రెండు నెలల్లో త‌గ్గిన ధ‌ర‌లు.. లోక్‌సభలో ఎంపీ లావు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతదేశపు ఆక్వా ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 70% వాటా కలిగిఉందని, ఏటా రూ. 25,000 కోట్ల టర్నోవర్ రాష్ట్రం నుండి జరుతుందని శుక్రవారం లోక్‌సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. జీరో అవర్లో ఆక్వా రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ.. ప్రస్తుతం ఏపీలో ఆక్వా పరిశ్రమ బాగా దెబ్బతిందని, గత రెండు నెలల్లో ఆక్వా ఉత్పత్తుల ధరలు భారీగా పడిపోయాయని అన్నారు. భారతదేశం నుంచి ప్రధాన ఆక్వా దిగుమతి దేశమైన చైనా కోవిడ్-19 కారణంగా తిరస్కరించడం వల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి 30% కంటే ఎక్కువ ఎగుమతిదారులు ఎగుమతులు చేయలేకపోయారని తెలిపారు.

జీఏసీసీ ద్వారా విజయవంతమైన ఆడిట్ తర్వాత కూడా యూనిట్లు ఇప్పటికీ నిలిపివేశారని, చైనాకు ఎగుమతులను ఇంకా ఆమోదించలేదని, దీని వల్ల ప్రాసెసింగ్ ప్లాంట్లు చాలా మూతపడ్డాయని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్ని వియత్నాం, ఇండోనేషియా కూడా ఎదుర్కొన్నాయని, కానీ చైనా ప్రభుత్వంతో వారు చేసుకున్న సంప్రదింపుల కారణంగా ఒప్పందాలు కుదుర్చుకోగలిగారని వెల్లడించారు. ఈ క్రమంలోనే, ఏపీకి చెందిన ఆక్వా రైతుల కేసును చైనాలోని సంబంధిత అధికారులతో చురుకుగా కొనసాగించాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement