Thursday, April 25, 2024

బిగ్ బాస్ లో అశ్లీల‌త ఉంటే చూడ‌కండి – ఎపి హైకోర్టు..

అమరావతి, ఆంధ్రప్రభ: బిగ్‌బాస్‌ షోలో అశ్లిలత..అభ్యంతరాలేవైనా ఉంటే ఆ ప్రదర్శన చూడరాదని హైకోర్టు స్పష్టం చేసింది. బిగ్‌ బాస్‌ కంటే అభ్యంతరకరమైన సన్నివేశాలతో ఏదో ఓ వేదికపై ప్రదర్శిస్తున్నారని వివరించింది. అయినా ఎవరేం మాట్లాడాలనేది న్యాయస్థానాలు నిర్దేశించలేవని తేల్చి చెప్పింది. ఇందుకు తగిన వేదికలు ఉన్నాయనే స్టార్‌ టీవీ వాదనను పరిగణనలోకి తీసుకుంటూ పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. స్టార్‌ టీవీ ప్రసారం చేస్తున్న బిగ్‌బాస్‌ షోలో అశ్లిdలత.. అనైతికత.. హింసాత్మక చర్యలతో పాటు యువతను పెడత్రోవ పట్టించే సన్నివేశాలు ఉన్నందున ప్రసారాలను నిలుపుదల చేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ ప్రతాప వెంకట జ్యోతిర్మయితో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపిం ది.

పిటిషనర్‌ తరుపున న్యాయవాది గుండాల శివప్రసాదరెడ్డి వాదనలు వినిపించారు. బిగ్‌ బాస్‌ షో అశ్లిdలతను ప్రేరేపించేదిగా ఉందని యువత చెడుదారి పట్టే ప్రమాదం ఉందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అంతేకాదు పోటీలో పాల్గొనే మహిళలకు గర్భ దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని చట్ట నిబంధన లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ తంతును నిలుపుదల చేయాలని కోరారు. స్టార్‌ టీవీ తరుపున న్యాయవాది శ్రీనివాస్‌ వాదిస్తూ బిగ్‌బాస్‌ షో సీజన్‌ ప్రస్తుతానికి ముగిసిందని టీవీ ఛానళ్లలో ప్రసార మయ్యే కార్యక్రమాలపై అభ్యంతరాలు ఉంటే వివిధ మార్గాలు ఉన్నాయని హైకోర్టును ఆశ్రయించట ం సరికాదన్నారు. ఫిర్యాదు చేసేందుకు చట్ట ప్రకారం వివిధ వేదికలు ఉన్నాయని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం బిగ్‌బాస్‌ షో అభ్యంతరంగా ఉంటే చూడవద్దని ఉద్ఘాటించింది. చట్ట ప్రకారం టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే కార్యక్రమాలపై ఫిర్యాదు చేసే వేదికలేంటో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని స్టార్‌ టీవీ యాజమాన్యాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. టీవీ కార్యక్రమాల్లో ఎవరేం మాట్లాడాలనేది న్యాయస్థానాలు నిర్ణియించ లేవని పునరుద్ఘాటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement