Wednesday, April 24, 2024

లోకేష్, పవన్ కళ్యాణ్ అసలు నాయకులే కాదు: డిప్యూటీ సీఎం ధర్మాన

ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అసలు నాయకులే కాదని అదృష్టం కొద్దీ సినిమాల్లో పవన్ కళ్యాణ్ పెద్ద ఫైటర్ అయ్యాడని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ జగన్‌ను విమర్శించేంత వాడైపోయాడని చురకలు అంటించారు. ఇప్పటికైనా లోకేష్ విజ్ఙతతో మెలగకపోతే టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు కూడా మిగలరని అన్నారు.

ఉత్తరాంధ్రను తామే అభివృద్ధి చేశామని అచ్చెన్నాయుడు చెబుతున్నారని.. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి విషయాలు సరిగా తెలుసుకోకుండా మాట్లాడటం దురదృష్టకరమని ధర్మాన కృష్ణదాస్ ఫైర్ అయ్యారు. అచ్చెన్నాయుడి దిగజారుడుతనానికి ఇది నిదర్శనమన్నారు. గతంలో అచ్చెన్నాయుడి సోదరుడు ఎర్రన్నాయుడు ఏనాడూ ఇలా మాట్లాడలేదని తెలిపారు. వైఎస్ఆర్ హయాంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిందని.. గోతులు తవ్వి , కొబ్బరికాయలు కొట్టడం టీడీపీ నేతలకు అలవాటైపోయిందని ఎద్దేవా చేశారు. ఎవడో కట్టిన ఇంటికి సున్నం వేసి మేమే కట్టేశామని గొప్పలు చెప్పడం సిగ్గుచేటన్నారు. టీడీపీ నేతలు కుప్పిగంతులు వేస్తుంటే ఊరుకునేది లేదని.. వారిని ధీటుగా ఎదుర్కొంటామని ధర్మాన స్పష్టం చేశారు.

ఈ వార్త కూడా చదవండి: ఏడేళ్ల పంచాయతీ… ఆ ఇద్దరూ కూర్చుంటే పరిష్కారం

Advertisement

తాజా వార్తలు

Advertisement