Friday, April 19, 2024

గ్రామీణాభివృద్ధి శాఖకుమరో అరుదైన గౌరవం.. స్కోచ్‌ స్టార్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ పురస్కారానికి ఎంపిక..

అమరావతి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణాభివృద్ధి శాఖకు మరో అరుదైన గౌరవం దక్కింది. గ్రామీణ పాలనలో అత్యుత్తమ విధానాలను అవలంభిస్తున్న రాష్ట్రంగా ప్రతిష్టాత్మక స్కోచ్‌ స్టేట్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ రిపోర్ట్‌-2021లో రాష్ట్రం దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. దీనిలో భాగంగా స్టార్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌-స్కోచ్‌ అవార్డుకు ఆంధ్రప్రదేశ్‌ ఎంపికైనట్లు స్కోచ్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ దీపక్‌ దలాల్‌ ప్రకటించారు. జూన్‌ 18వ తేదీన ఢిల్లీలో ఇండియన్‌ గవర్నెన్స్‌ ఫోరం ఆధర్యంలో జరుగనున్న కార్యక్రమంలో ఈఅవార్డును ప్రధానం చేయనున్నట్లు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ దివేదికి రాసిన లేఖలో ఆయన వెల్లడించారు.

స్టార్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ స్కోచ్‌ అవార్డుకు ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ ఎంపికవ్వడం పట్ల రాష్ట్ర డిప్యూటీ సీఎం (పిఆర్‌ ఆర్డీ) బూడి ముత్యాలనాయుడు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు, విప్లవాత్మకమైన సంస్కరణల ఫలితంగానే జాతీయ స్థాయిలో ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖకు అరుదైన గుర్తింపు లభించిందన్నారు. గ్రామీణ పాలనలో సీఎం వైయస్‌ జగన్‌ ముందుచూపుతో తీసుకువచ్చిన మార్పులు జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచాయని తెలిపారు. పారదర్శక పాలన, ప్రజల చెంతకే ప్రభుత్వ సేవలను తీసుకువెళ్ళడం వంటి అంశాలతో ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణాభివృద్ధిలో విజయవంతమైన ఫలితాలను సాధిస్తోందని, దానికి నిదర్శనమే తాజాగా స్టార్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ స్కోచ్‌ అవార్డుకు ఎంపిక అవ్వడమన్నారు. ఇందుకు గానూ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఇతర అధికారులు, ఉద్యోగులను ఆయన అభినందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement