Thursday, April 18, 2024

కాంగ్రెస్‌కు మరో జ‌లక్‌.. బీజేపీలోకి విష్ణువర్ధన్‌ రెడ్డి?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కాంగ్రెఎస్‌కు మరో ఝలక్‌ తగలనుంది. కాంగ్రెస్‌ పార్టీని మరో కీలక నేత వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ దివంగత నేత పి.జనార్థన్‌ రెడ్డి కుమారుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆయన కాంగ్రెస్‌ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. దీనికి ముహూర్తం కూడా ఫిక్స్‌ అయినట్లు సమాచారం. ఈనెల 28న పీజేఆర్‌ వర్ధంతి తర్వాత ఆయన కమలం గూటికి చేరనున్నట్లు పొలిటికల్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గత కొంత కాలం నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

తాజాగా కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన జంబో కమిటీలోనూ ఆయనకు చోటు దక్కలేదు. పార్టీ కార్యక్రమాల్లో అంటిముట్టనట్లుగా ఉండడం, జంబో కమిటీలో స్థానం దక్కకపోవడం, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వంపై అసహనంతో ఉన్న నేపథ్యంలో విష్ణువర్ధన్‌ రెడ్డి పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ నేతలు ఆయనతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. మరోవైపు విష్ణువర్ధన్‌ రెడ్డిని బుజ్జగిండానికి కాంగ్రెస్‌ నేతలు కూడా రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం.

- Advertisement -

‘చేయి’జారుతున్న నగర నేతలు…

కాంగ్రెస్‌ వ్యవహారం నచ్చక మాజీ ముఖ్యమంత్రి కుమారుడు మర్రి శశిధర్‌ రెడ్డి ఇటీవల బీజేపీలోకి చేరిన విషయం తెలిసిందే. అదే దారిలో మరో దివంగత కీలక నేత తనయుడు విష్ణువర్ధన్‌ రెడ్డి సైతం బీజేపీలోకి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ బలహీన పడిందని రాజకీయ భవిష్యత్‌ను వెతుక్కునే పనిలో పలువురు నేతలు పడ్డారు. కాంగ్రెస్‌కు వీరవిధేయులుగా ఉన్నవారే ఆ పార్టీకి దూరం అవుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే మంచి పట్టు ఉండేది. క్రమంగా నగరంలో పార్టీ చేజారిపోయింది.

ప్రస్తుతం ఉన్న నాయకుల పట్ల కాంగ్రెస్‌ కేడర్‌ వ్యతిరేకత భావనతో ఉండడం మైనస్‌గా మారింది. పీజేఆర్‌ కుమార్తె విజయారెడ్డిని టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేర్చుకొని గ్రేటర్‌లో కాంగ్రెస్‌ బలోపేతానికి ప్రయత్నించిన రేవంత్‌ రెడ్డి…మరీ విష్ణువర్ధన్‌ రెడ్డిని చేయిజారిపోకుండా ఆపుతాడో లేదో చూడాల్సి ఉంది. కాంగ్రెస్‌ పార్టీలో తనకు బాధ్యతలు ఇస్తే పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని గతంలో చెప్పినా విష్ణు…ప్రస్తుతం జంబో కమిటీలో ఆయనకు స్థానం దక్కకపోవడం, నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి ఉన్న క్రమంలో ఆయన కాంగ్రెస్‌లో కొనసాగుతారో లేకుంటే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారో ఇంకా తేలాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement