Saturday, April 20, 2024

ఏపీలో కరోనా తగ్గుముఖం పడుతోంది: అనిల్ కుమార్ సింఘాల్

ఏపీలో వారం రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర పభుత్వం తీసుకుంటునే చర్యలే దీనికి కారణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 పడకల సామర్థ్యం కలిగిన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల(పీఎస్ఏ ప్లాంటు) నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వ్యాక్సినేషన్ సందర్భంగా టీకా దుర్వినియోగమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో 79,564 శాంపిళ్లను టెస్ట్ చేయగా, 13,756 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 104 మంది మృతి చెందారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,054 ఐసీయూ బెడ్లు, 4,854 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. నేటి వరకూ కొవిడ్ కేర్ సెంటర్లలో 15,480 మంది చికిత్స పొందుతున్నారన్నారు. కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తున్నాయన్నారు. ఈనెల 28న 1,80,362 యాక్టివ్ కేసులుంటే, గడిచిన 24 గంటల్లో 1,73,622 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ఆసుపత్రుల్లో శుక్రవారం 31,074 మంది వైద్య సేవలు పొందితే… శనివారం నాటికి 29,973 చికిత్స పొందుతున్నారన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో శుక్రవారం నాటికి 15,917 మంది ఉంటే శనివారం 15,480 మంది ఉన్నారన్నారు. హోం ఐసోలేషన్లలో శుక్రవారం నాటికి 1,33,371 మంది ఉంటే, శనివారం 1,28,169 మంది ఉన్నారన్నారు. ఆసుపత్రుల్లోనూ, కొవిడ్ కేర్ సెంటర్లలోనూ, హోం ఐసోలేషన్లలోనూ చికిత్స పొందుతున్నవారి సంఖ్య రోజు రోజుకూ తగ్గుతూ వస్తోందన్నారు.

గతంలో పోలిస్తే 104 కాల్ సెంటర్‌కు వచ్చే ఫోన్ కాల్స్ సంఖ్య కూడా తగ్గుముఖం పట్టాయన్నారు. 104 కాల్ సెంటర్ కు గడిచిన 24 గంటల్లో 5,500 ఫోన్ కాల్స్ రాగా, వాటిలో వివిధ రకాల సమాచారాల కోసం 2,552 కాల్స్ వచ్చాయన్నారు. ఆసుపత్రుల్లో అడ్మిషన్లకు కేవలం 808 కాల్స్ మాత్రమే వచ్చాయన్నారు. కరోనా టెస్టులకు 1,261 కాల్స్, ఫలితాల కోసం 609 మంది ఫోన్ చేశారన్నారు. 25 రోజుల కిందట అడ్మిషన్ల కోసం నాలుగు వేల పైన ఫోన్ కాల్స్ వచ్చేవన్నారు. గడిచిన 24 గంటల్లో హోం ఐసోలేషన్‌లో ఉన్నవారితో పాటు గుర్తించిన జ్వరపీడితులు 14,526 మందితో వైద్యులు ఫోన్ చేసి, వారి ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీశారన్నారు.

రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం
అన్ని జిల్లాల్లో కరోనా పాజటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తూర్పుగోదావరి, చిత్తూరు, విశాఖపట్నం, కర్నూల్, అనంతపురం జిల్లాలతో పాటు గుంటూరు, పశ్చిమగోదావరి, నెల్లూరు, కడప, శ్రీకాకుళం, కృష్ణా, విజయనగరం… ఇలా అన్ని జిల్లాలోనూ కరోనా కేసులు తగ్గాయని తెలిపారు. కరోనా పాజటివ్ రేటును పరిశీలిస్తే…పాజిటివీటి రేట్ మే 3వ తేదీ నుంచి మే 16 తేదీ వరకూ 25.5 శాతానికి పెరిగి అప్పటి నుంచి తగ్గుతూ వచ్చిందన్నారు. శనివారం నాటికి(మే 29) 17.29 శాతానికి తగ్గిందన్నారు. రికవరీ రేటును పరిశీలిస్తే… ఏప్రిల్ 16 నుంచి 95.46 శాతంగా ఉందని, అప్పటి నుంచి కేసులు పెరిగాయని తెలిపారు. మే 7వ తేదీనాటికి 84.32 శాతానికి పడిపోయిందన్నారు. అప్పటి నుంచి రికవరీ రేటు పెరుగుతూ వచ్చిందని, శనివారం నాటికి(మే 20) 89 శాతంగా నమోదయ్యిందని తెలిపారు. యాక్టివ్ కేసుల సంఖ్యకు వస్తే…. ఏప్రిల్ 16 తేదీన 35,592 కేసులు ఉండగా, మే 17వ తేదీ నాటికి 2,11,554 కరోనా కేసులు నమోదయ్యాయన్నారని, ఆనాటి నుంచి తగ్గుతూ వచ్చాయని వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,73,622 యాక్టివ్ కేసుల ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలిస్తూ, కొవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడానికి కారణమయ్యాయన్నారు.

కేంద్రం నిర్ణయం మేరకే రాష్ట్రాలకు ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు సరఫరా

- Advertisement -

రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ నివారణకు గుర్తించిన ఆసుపత్రుల్లో వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని ఆర్డర్లు పెట్టినా, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకే రాష్ట్రాలకు ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు సరఫరా అవుతున్నాయన్నారు. శుక్రవారం వరకూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం 76,550 ఇంజక్షన్ల ఆర్డర్ పెట్టిందని, కేంద్రం నుంచి 5, 250 ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. శనివారం(మే 20) మరో 2,475 ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు కేంద్రం అందజేసిందన్నారు. నేటి వరకూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి 7,726 ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు ఇంజక్షన్లు వాటన్నింటినీ జిల్లాలకు సరఫరా చేశామన్నారు. శనివారం( మే 29) మరో 15 వేల ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం…కేంద్రానికి ఆర్డర్ ఇచ్చిందన్నారు. ఈ ఇంజక్షన్లతో పాటు 12,250 పొసకొనజోల్ ఇంజక్షన్లకు కూడా ఆర్డరిచ్చామన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 500 పొసకొనజోల్ ఇంజక్షన్లను రాష్ట్రానికి ఇవ్వగా వాటిని అన్ని జిల్లాలకు అందజేశామన్నారు. శనివారం(మే 29)న మరో 750 ఇంజక్షన్లను కేంద్రం అందజేసిందని, వాటిని కూడా జిల్లాలకు సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. కేంద్రానికి 90 వేల పొసకొనజోల్ ట్యాబ్ లెట్ల శాచిలకు ఆర్డర్లు ఇవ్వగా, 15 వేల ట్యాబ్ లెట్ల శాచిలను గతంలో అందజేసిందన్నారు. శనివారం( మే 29)న మరో 10 వేల పొసకొనజోల్ ట్యాబ్‌లెట్ల సాచెట్లను అందజేసిందని, వాటిని జిల్లాలకు సరఫరా చేస్తున్నామన్నారు. మరో 50 వేల పొసకొనజోల్ ట్యాబ్‌లెట్ల సాచెట్ల కోసం కేంద్రానికి ఆర్డర్ పెట్టామన్నారు.

తగ్గుతున్న ఆక్సిజన్ వినియోగం
నిన్నటి వరకూ 808 బ్లాక్ ఫంగస్ కేసుల రాష్ట్రంలో గుర్తించామన్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో, రాష్ట్రంలో కరోనా బాధితులకు వినియోగించే ఆక్సిజన్ కూడా తగ్గుతోందన్నారు. ఎప్పటిలాగే గడిచిన 24 గంటల్లో 700 టన్నుల ఆక్సిజన్ ను కేంద్రం నుంచి డ్రా చేశామన్నారు. కరోనా కేసులు తగ్గుతూ వస్తుండడంతో, వినియోగం కూడా ఆ స్థాయిలో తగ్గుముఖం పడుతోందన్నారు. గత నాలుగు రోజుల డేటా ను పరిశీలిస్తే… ఈ నెల 24వ తేదీన 565 టన్నులు, 25న 551 టన్నులు, 26న 543 టన్నులు, 27న 521 టన్నులు, 28న 510 టన్నులు వినియోగించామన్నారు. ఒకే రోజు 640 టన్నుల నుంచి 510 టన్నుల ఆక్సిజన్ వినియోగానికి తగ్గిందిన్నారు.

వ్యాక్సినేషన్ దుర్వినియోగమైతే కఠిన చర్యలు

కరోనా వ్యాక్సినేషన్ దుర్వినియోగం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా టీకా వేయాల్సిందేనని స్పష్టం చేశారు. గడిచిన రెండ్రోజుల్లో 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేశామన్నారు. గురువారం 5 .60 లక్షల మందికి, శుక్రవారం 4.33 లక్షల మందికి వ్యాక్సిన్ వేశామన్నారు. మే 28 నాటికి రాష్ట్రంలో 5,21,210 డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. వాటిలో కొవిషీల్డ్ 3,20,390 డోసులు, కొవాగ్జిన్ 2,00,820 డోసులు ఉన్నాయన్నారు. ఆదివారం మధ్యాహ్నానికి ఈ డోసులు వేసేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి జులై 15 లోగా 6.99 లక్షల కొవిషీల్డ్ డోసులు రావాల్సి ఉందని, ఇదే విషయం కేంద్ర ప్రభుత్వ అధికారులకు తెలిపామని వెల్లడించారు. నేటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 94,74,745 టీకాలు పంపిణీ చేశామని, వాటిలో రెండు డోసులను 24,12,876 మందికి, మొదటి డోసును 46,48,993 మందికి వేశామన్నారు.

అన్ని ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు
రాష్ట్ర వ్యాప్తంగా 50 పడకల సామర్థ్యం కలిగిన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల(పీఎస్ఏ ప్లాంటు) నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వాటిలో కొన్ని కేంద్రం, మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని నిర్మించనున్నాయన్నారు. ఈ మేరకు జీవో సైతం ఇచ్చి టెండర్లు పిలిచామన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ సహకారంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో పీఎస్ఏ ప్లాంట్ల నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం సబ్సిడీ అందజేస్తోందన్నారు. ఇందుకు సంబంధంచిన విధి విధానాలను వారం రోజుల్లో వెల్లడిస్తామన్నారు. ఏపీలో సూపర్, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లా కేంద్రాలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్లలో సూపర్, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి భూములు కేటాయించాలని ఆయా జిల్లా కలెక్టర్లను సీఎం జగన్ ఆదేశించారన్నారు. ఈ ఆసుపత్రుల నిర్మాణాన్ని వైద్య ఆరోగ్య శాఖ, పరిశ్రమల శాఖ సంయుక్తంగా పర్యవేక్షిస్తాయన్నారు. సూపర్, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి సంబంధించిన విధి విధానాలను రెండు వారాల్లో వెల్లడిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం వరకు 66 విజిలెన్స్ కేసులు నమోదు చేశామని, వాటిలో 43 కేసులకు పెనాల్టీ విధించామన్నారు. ఈ 43 కేసుల్లో పెనాల్టీ పది రెట్లు అధికంగా విధించామన్నారు. మిగిలిన 23 కేసులకు సంబంధించి పెనాల్టీపై నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. కొవిడ్ వల్ల తల్లిదండ్రులు మృతి చెందడంతో అనాథలైన చిన్నారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వారికి ఆర్థిక ఇబ్బందులు, చదువుకు ఇక్కట్లు రాకుండా నెల నెలా ఫిక్స్‌డ్ డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీ చెల్లిస్తామన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement