Wednesday, April 17, 2024

వేతనాల కోసం అంగన్‌వాడీల ఎదురుచూపు.. మూడు నెలలుగా అందని జీతాలు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అంగన్‌వాడీల కేంద్రాల నిర్వహణ వర్కర్లకు రోజురోజుకూ భారంగా మారుతోంది. కేవలం గౌరవ వేతనంతో పనిచేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు ఆ వేతనం కూడా సరిగ్గా అందని పరిస్థితి లేకపోవడంతో ఆవేదనలో ఉన్నారు. ఆర్ధిక కష్టాలతో జీవితాలను నెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో 55,607 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, వాటిలో ఇదే స్థాయిలో వర్కర్లు, హెల్పర్లు ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఈ అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ సాగుతోంది. అయితే, గడచిన మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు అగచాట్లు పడుతున్నారు. ఇదే సమయంలో కూరగాయల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో కేంద్రాల నిర్వహణ కష్టతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో వేతనాలు అందితే తమ సొంత అవసరాలను తీర్చుకోవడంతోపాటు కేంద్రాల నిర్వహణకు ఎంతోకొంత తమ సొంత సొమ్మును వినియోగిస్తామని ఇప్పటివరకూ అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా ముందుకు వెళ్తున్నామని పేర్కొంటున్నారు.

ప్రస్తుతం నిత్యావసరాల ధరలతోపాటు ఇతర ఖర్చులు పెరిగిపోవడంతో చాలీచాలని వేతనంతో తమ జీవితాలను నెట్టుకొస్తున్నామని, నెలల తరబడి జీతాలు పెండింగ్‌లో ఉండటంవల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా కేంద్రాల్లో మధ్యాహ్న భోజన నిమిత్తం తీసుకొస్తున్న కూరగాయలు ఖర్చు కూడా భారంగా మారిందని ఇక అలాగే గర్భిణీలకు శ్రీమంతాలు చేసే బాధ్యతను కూడా తమకు అప్పగించడంతో ఖర్చు మరింత పెరిగిందని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబరు వరకే వేతనాలు అందాయని అంగన్‌వాడీ యూనియన్‌ నేతలు పేర్కొంటున్నారు. కొన్ని జిల్లాల్లో మూడు నెలలు పెండింగ్‌ ఉండగా మరికొన్ని జిల్లాల్లో రెండు నెలలు వరకూ బకాయిలు ఉన్నాయని చెబుతున్నారు. దాదాపు రూ.70 కోట్ల వేతన బకాయిలు ఉన్నట్లుగా పేర్కొంటున్నారు.

- Advertisement -

అంగన్‌వాడీ మెయిన్‌ వర్కర్లతోపాటు మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల వేతనాలు ఇప్పటివరకూ అందని పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఒక్కొక్క జిల్లాలో రూ.2.5 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లుగా యూనియన్‌ నేతలు స్పష్టంచేస్తున్నారు. ప్రస్తుతం ఆర్ధిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో వేతనాలు ఈనెల్లోనైనా అందుతాయో లేదన్న అందోళనను వ్యక్తంచేస్తున్నారు. కూరగాయల బిల్లులకు సంబంధించి మూడు నెలలుగా బకాయిలు ఉన్నాయని తెలుపుతున్నారు. ఈబకాయిలు కూడా రాష్ట్రవ్యాప్తంగా కోట్లలోనే ఉన్నట్లుగా వెల్లడిస్తున్నారు. గడచిన మూడు నెలలుగా జీతాలు, కూరగాయల బిల్లులు చేతికి అందకపోవడంతో అప్పులతో కేంద్రాల నిర్వహణ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

నాలుగేళ్లుగా టీఏ, డీఏ బకాయిలు

ఇదిలా ఉంటే గడచిన నాలుగేళ్లుగా టీఏ, డీఏ బకాయిలు కోసం అంగన్‌వాడీ వర్కర్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లా ప్రధాన కార్యాలయాలతోపాటు ఇతర కార్యక్రమాలకు వెళ్లేందుకు నెలకు దాదాపు 800 నుండి వెయ్యి వరకూ ఖర్చవుతుందని ఈ మొత్తాన్ని తామే భరిస్తున్నామని అంగన్‌వాడీ వర్కర్లు చెబుతున్నారు. దాదాపుగా ఒక్కో వర్కర్‌కు రూ. 20 వేల మొత్తం ఈనాలుగేళ్లుగా టీఏ, డీఏల రూపంలో అందాల్సి ఉందని యూనియన్‌లు స్పష్టంచేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఆర్ధిక సంక్షోభం దృష్ట్యా ప్రభుత్వం మానవతా కోణంతో ఆలోచించి నిధులను విడుదలచేసి ఆర్ధిక కష్టాల నుండి విముక్తి కల్పించాలని అంగన్‌వాడీలు విజ్ఞప్తి చేస్తున్నారు.

త్వరలోనే చెల్లింపులు..

అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాల వేతనాలకు సంబంధించి బిల్లులు ట్రెజరీలకు పంపామని, త్వరలోనే చెల్లింపులు చేయనున్నట్లుగా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు స్పష్టంచేస్తున్నారు. ప్రస్తుతం కొత్త జిల్లాలకు అనుగుణంగా కేంద్రాల పునర్విభజన జరుగుతుండటంతో చెల్లింపుల్లో జాప్యం జరిగుతున్నట్లుగా వెల్లడిస్తున్నారు. అలాగే కూరగయాలు, ఇతర బిల్లులను ప్రభుత్వానికి పంపామని, త్వరలోనే ఆమోదం లభిస్తుందని చెబుతున్నారు. ఈబకాయిలను కూడా సాధ్యమైనంత త్వరగా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికార యంత్రాంగం పేర్కొంటుంది. మరో వారం రోజులలోనే చెల్లింపులు పూర్తయ్యే అవకాశాలున్నట్లుగా వెల్లడిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement